లేబర్ కోడ్ రూల్స్ అమలును తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో దగ్ధం
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
మే 8 తేదీన లేబర్ కోడ్లను అమల్లోకి తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం నిబంధనలను జారీ చేయడాన్ని కార్మికులు తీవ్రంగా ఖండిస్తున్నామని
CITU జిల్లా కార్యదర్శి, యూనియన్ గౌరవ అధ్యక్షులు కాముని గోపాలస్వామి, యూనియన్ జిల్లా కార్యదర్శి సింగిరెడ్డి చంద్రారెడ్డి అన్నారు. ఈ సందర్బంగా సిద్దిపేట సర్కిల్ ఆఫీస్ విద్యుత్ భవన్ గేట్ ముందు గేజిట్ కాపీలను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం మాట్లాడుతూ ఈ లేబర్ కోడ్లను ఏప్రిల్ 1 నుండే అమల్లోకి తీసుకురావాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం భావించినప్పటికీ నిబంధనలను ప్రకటించడానికి నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు పూర్తయ్యేవరకు మోసపూరితంగా వేచి చూసిందని, ఎన్నికల ఫలితాలు వెలువడిన నాలుగు రోజుల వ్యవధిలోనే వారు లేబర్ కోడ్లను అమల్లోకి తీసుకువచ్చారని పేర్కొన్నారు.
బిజెపి నేతృత్వంలోని మోడీ ప్రభుత్వ మోసపూరితమైన వ్యవహార శైలిని బట్టబయలు చేసిందని విమర్శించారు.‘లేబర్ కోడ్లను అమలు చేయడానికి, రాష్ట్రాల ముసాయిదా నిబంధనలు సిద్ధం చేయడానికి బిజెపి నేతృత్వంలోని రాష్ట్రాలు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. కార్మికుల ప్రయోజనాలను పరిర క్షించడానికి సవరణలు తీసుకురావాలని రాష్ట్రాల ప్రభుత్వాలకు సీఐటీయూ డిమాండ్ చేస్తుందన్నారు .
రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో కార్మిక సమస్యలు 22, 23, 24 అంశాలుగా పేర్కొనబడినందున రాష్ట్రాల సవరణలు తీసుకు రావడానికి రాష్ట్రాల అసెంబ్లీలకు అధికారం వుంటుందని తెలిపారు భారత రాజ్యాంగం కింద తమకు సంక్రమించిన చట్టపరమైన అధికారాలను ఉపయోగించుకుని రాష్ట్ర ప్రభుత్వాలు లేబర్ కోడ్లకు సవరణలు తీసుకురావాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన కేంద్ర నిబంధనల ప్రకారం లేబర్ కోడ్లను అమలు చేయడానికి బదులుగా కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించాలని కోరారు.లేబర్ కోడ్స్ రద్దు చేసేవరకు ఐక్య కార్మిక ఉద్యమాలు చేపడతామని తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు ర్యాకం అశోక్,కమ్మరి నవీన్, సిద్ధంరాజు, కనకరాజు, సరిత, కిరణ్,బాబు,కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు