Take a fresh look at your lifestyle.

6 ఏళ్లలో రూ.20 వేల కోట్ల అభివృద్ధి చేశా

  • కరీంనగర్ పార్లమెంట్ ను నెంబర్ 1గా తీర్చిదిద్దడమే లక్ష్యం
  • ప్రజల అభ్యున్నతి కోసం స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి పనిచేస్తున్నా
  • కేంద్ర మంత్రిగా మరిన్ని నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తా
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
  • వీణవంక, జమ్మికుంట గండ్రపల్లిలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్లు ప్రారంభం
  • ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో కలిసి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : గడిచిన 6 ఏళ్లలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధి కోసం రూ.20 వేల కోట్లకుపైగా నిధులను ఖర్చు చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కేంద్ర మంత్రిగా మరిన్ని నిధులు తీసుకొచ్చి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివ్రుద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యం పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.ప్రజల అభ్యున్నతి, సంక్షేమం కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు ఉదయం హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కు స్థానిక బీఆర్స్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్వాగతం పలికారు. ఆయనతో కలిసి జాతీయ ఉపాధి పథకం కింద వీణవంకలో రూ.78 లక్షల వ్యయంతో నిర్మించిన 18 అంతర్గత సీసీ రోడ్లను, అట్లాగే జమ్మికుంట మండంలోని గండ్రపల్లి, ఇతర గ్రామాల్లో 78 లక్షల వ్యయంతో నిర్మించిన 13 అంతర్గత రోడ్లను ప్రారంభించారు. స్థానిక బీజేపీ నాయకుల నివాసాలకు వెళ్లి ముచ్చటించారు. అనంతరం బండి సంజయ్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.అందులో ముఖ్యాంశాలు..హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలంలో జాతీయ ఉపాధి హామీ నిధుల కింద 78 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 18 అంతర్గత సీసీ రోడ్లున ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. మీకు తెలుసు.. మోదీగారి ప్రభుత్వం రోడ్లకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. నేను ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉంటూ ఎక్కువ నిధులు కరీంనగర్ పార్లమెంట్ కు తీసుకొచ్చానంటే అవి రోడ్ల కోసమే.కరీంనగర్ పార్లమెంట్ అభివ్రుద్ధి కోసం గత ఆరేళ్లలో మొత్తంగా 20 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చిన. అందులో సింహభాగం గ్రామీణ ఉపాధి హామీ, ప్రధానమంత్రి సడక్ యోజన, సీఆర్ఐఎఫ్ కార్యక్రమాల నిధులతోపాటు జాతీయ రహదారుల విస్తరణ కోసమే ఎక్కువ నిధులు తీసుకొచ్చిన. ఎందుకంటే ఏ దేశమైనా, రాష్ట్రమైనా, జిల్లా, గ్రామమైనా రవాణా సౌకర్యాలు బాగుంటేనే అవి బాగుపడతాయి.నేను 5 ఏళ్లు ఎంపీగా ఉన్నప్పుడు రెండేళ్ల కాలాన్ని కరోనా మింగేసింది. అయినా ప్రజల కోసం మోదీగారిని ఒప్పించి భారీ నిధులు తీసుకొచ్చా.. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఇంకా నిధులు తీసుకొచ్చే అవకాశం వచ్చింది. మొదటిసారి ఎంపీ అయినప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో రాష్ట్రమంతా తిరిగాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కరీంనగర్ పార్లమెంట్ ను అభివ్రుద్ధిలో నెంబర్ 1గా తీర్చిదిద్దడమే లక్ష్యంతో పనిచేస్తున్నా.అందుకోసం స్థానిక ఎమ్మెల్యేలందరితో కలిసి అన్ని గ్రామాలు, మండలాలను అభివ్రుద్ధి చేస్తున్నా..అందులో భాగంగా CRIF నిధుల కింద 291 కోట్ల రూపాయలను ఖర్చు చేసి 1341 కిలోమీటర్ల మేరకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రోడ్లను నిర్మించినం. అట్లాగే జాతీయ ఉపాధి హామీ పథకం కింద గత ఆర్ధిక సంవత్సరంలో పార్లమెంట్ నియోజకవర్గంలో 31 కోట్ల 13 లక్షల రూపాయలు ఖర్చు చేసి రోడ్లను నిర్మించినం. మొత్తంగా జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఇప్పటి వరకు దాదాపు 650 కోట్ల రూపాయల నిధులను మన పార్లమెంట్ పరిధిలో ఖర్చు చేసినం.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీర్వాదంతో ఎంపీగా ఎన్నికైనప్పటి నుండి ఇప్పటి వరకు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో జాతీయ రహదారుల నిర్మాణం కోసం దాదాపు 5 వేల కోట్లకుపైగా ఖర్చు చేసినం. కరీంనగర్ నుండి వరంగల్, సిద్దిపేట నుండి ఎల్కతుర్తి నేషనల్ హైవేలను ఏ విధంగా అభివ్రుద్ది చేస్తున్నామో మీ అందరికీ తెలిసిందే. మరికొద్ది రోజుల్లోనే కరీంనగర్- జగిత్యాల రోడ్డ నిర్మాణ పనులను చేపట్టబోతున్నం.టెండర్ల ప్రక్రియ కూడా త్వరలోనే మొదలు కాబోతోంది.ఎన్నికల వరకే రాజకీయాలు.ఎన్నికల తరువాత అభివ్రుద్ధే మా ధ్యేయం. అభివ్రుద్ధి, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరించేందుకు సిద్దంగా ఉన్నాం.ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులతో కలిసి పనిచేస్తున్నా.ఎందుకంటే అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తే ప్రజలకు మరింత మేలు చేయొచ్చనే ఉద్దేశంతోనే పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నా..అందరూ సహకరించాలని, అంతిమంగా ఓట్లేసి గెలిపించిన ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేయాలని కోరుతున్నా అన్నారు.

Leave A Reply

Your email address will not be published.