ముద్ర ప్రతినిధి, భువనగిరి :
జిల్లా వ్యాప్తంగా శ్రీ సీత రాముల కళ్యాణం అన్ని దేవాలయాలలో శుక్రవారం అంగ రంగ వైభవంగా జరిగింది. భువనగిరి పట్టణంలోని అంజనాద్రి ఆలయంలో, ఖిల్లానగర్ లోని శ్రీ సీతారామాంజనేయ సహిత సంతోషమాత ఆలయంలో, శ్రీ పచ్చల కట్ట సోమేశ్వర ఆలయంలో, మాస్ కుంట ఆంజనేయ స్వామి ఆలయంలో, రాంనగర్ లోని రామాలయంలో, కిసాన్ నగర్ లోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఆయా దేవస్థానాల కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు ఘనంగా జరిపారు. వేలాది గా భక్తులు పాల్గున్ని స్వామి వారి కళ్యాణాన్ని తిలకించారు.

ఈ సందర్బంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజూల వెంకటేశ్వర్లు, ఆలయ కమిటీ చైర్మన్ లు, ధర్మకర్తలు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

యాదగిరిగుట్టలో శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని కొండపైన పర్వత వర్ధిని శ్రీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం శాస్త్రోక్తముగా వైభవముగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో దేవస్థాన అనువంశిక ధర్మకర్త భాస్కరాయని నరసింహమూర్తి, దేవస్థాన కార్యనిర్వహణాధికారి భవాని శంకర్ పాల్గొన్నారు.