ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలో అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము వరకు పోలీసుల ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల భద్రతకు ప్రధాన ప్రాధాన్యత ఇస్తూ జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఆదేశాలమేరకు జగిత్యాల పట్టణం లో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. రాత్రి సమయంలో నిఘా మరింత పటిష్టం చేస్తూ సమయానుకూల చర్యలు తీసుకోవడం ద్వారా చాలా వరకు నేరాలను నియంత్రించవచ్చనే జిల్లా ఎస్పి ఆలోచన మేరకు జగిత్యాల పట్టణం లోని ప్రదాన కూడలు,బస్ స్టాండ్,చౌరస్తాల్లో, రహదారి పాయింట్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించామని తెలిపారు.ఈ తనిఖీల ముఖ్య ఉద్దేశం నేరాలు నివారించడమే అన్నారు.ఈ సందర్భంగా నిషేధిత మత్తుపదార్ధాలు, ఇతర చట్టవిరుద్ధ వస్తువులను గుర్తించేందుకు శిక్షణ పొందిన నార్కోటిక్ డాగ్ స్క్వాడ్లతో, బాంబ్ స్క్వాడ్ సిబ్బందితో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.నిషేధిత మత్తుపదార్థాల వినియోగం, అక్రమ రవాణా నిరోధించడం, చట్టవిరుద్ధ చర్యలపై పటిష్ట నిఘా పెట్టడం, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100 కి సమాచారం అందించాలని సూచించారు.సమాజంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని పొలిసు అదికారులు కోరారు.
