ముద్ర ప్రతినిధి , కోదాడ ….
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో రేపు జరుగనున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఎన్నికల్లో విధులు నిర్వర్తించనున్న సిబ్బందికి పట్టణంలోని త్రివేణి పంక్షన్ హల్ నందు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది . ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతలను కాపాడడంలో పోలీస్ సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని ఎస్పీ తెలిపారు . బందోబస్తు విధులలో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా, పూర్తి అంకితభావం, క్రమశిక్షణతో తమ బాధ్యతలను నిర్వహించాలని ఎస్పీ స్పష్టం చేశారు. విధులు పూర్తయ్యే వరకు కేటాయించిన విధులు, ప్రాంతాలు వదలొద్దన్నారు . పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను క్రమపద్దతిలో ఉంచాలని, అనుమతిలేని వ్యక్తులను కానీ ఓటరు కానీ వారిని కానీ పోలింగ్ స్టేషన్ పరిసరాల్లో రానివ్వోద్దని , 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు పటిష్టంగా అమలు చెయ్యాలన్నారు . ఓటర్లు సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు పోలింగ్ బూత్ లోకి తెస్తున్నారా అనేదానిపై పటిష్ట నిఘా ఉంచాలన్నారు . ఎన్నికల సామాగ్రి తరలించడంలో రూట్ మొబైల్ పోలీసు సిబ్బంది విధులు ముఖ్యమైనవని, ఎన్నికల సామాగ్రికి పూర్తి భద్రత కల్పిస్తూ పోలింగ్ సామగ్రిని పోలింగ్ బూత్ లకు చేర్చడం, స్ట్రాంగ్ రూమ్ లకు తరలించడంలో అప్రమత్తంగా పని చేయాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో ఎక్కడైనా అనుకోని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్న, ఇబ్బందులు వచ్చినా, ఎవరైనా గొడవలు పడినా, గుంపులుగా చేరినా సంభందిత స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బందికి, రూట్ మొబైల్ సిబ్బందికి వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు .
ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది ఎన్నికల కోడ్ (ఎంసీసీ) నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ, ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విధి నిర్వహణలో సిబ్బందికి ఏవైనా ఇబ్బందులు , సమస్యలు ఎదురైతే వాటిని వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, వ్యక్తిగతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని జిల్లా ఎస్పీ సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల భద్రత అనేది ఒక సమష్టి బాధ్యత అని, దీనిని విజయవంతం చేయడంలో సిబ్బంది పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. ఈ సమావేశం నందు అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి, సూర్యాపేట డివిజన్ డిఎస్పీ ప్రసన్నకుమార్, CI లు వెంకటయ్య, రాజశేఖర్, రామారావు, శివకుమార్, ప్రవీణ్ కుమార్, ఎస్ఐ లు, ఏఎస్ఐ లు, సిబ్బంది ఉన్నారు.