ముద్ర, ప్రతినిధి భువనగిరి :
రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ్మస్వామి పుణ్యక్షేత్రాన్ని గురువారం కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు.

రాష్ట్ర గవర్నర్ కు ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్, రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి, రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణా రెడ్డి గవర్నర్ కు పూల మొక్కలు బహుకరించి స్వాగతం పలికారు.

తొలుత రాష్ట్ర గవర్నర్ పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. వేద పండితులు, అర్చకులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి భావానీ శంకర్ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు, వేద పండితులు ఆలయ సంప్రదాయంతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. గవర్నర్ ధ్వజ స్తంభం వద్ద మొక్కి స్వామి వారి అంతరాలయం లోఅర్చన పూజలు నిర్వహించారు. కార్య నిర్వాహణాధికారి స్వామి వారి మెమొంటోను అందచేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త స్వామి వారి ప్రసాదాన్ని గవర్నర్ కు అందచేశారు.

అనంతరం అనుబంధ దేవాలయం శ్రీ పర్వత వర్ధిణి సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో స్పటిక లింగానికి అభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.