Take a fresh look at your lifestyle.

కొత్త కార్డులకు ముందే..? తెల్ల కార్డులపై సర్కారు కీలక నిర్ణయం

6 నెలల పాటు రేషన్ తీసుకోని కార్డుల వివరాలు
మండలాల వారీగా పంపించాలని ఆదేశం
వాటిని తొలిగించేందుకు ప్రాథమిక నివేదిక

ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం చేస్తున్న ప్రభుత్వం.. కొన్ని లక్షల మేర పాత కార్డులను ఏరివేసేందుకు సిద్ధమవుతోంది. ముందుగా రేషన్ సరఫరాలో కీలక మార్పుల దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అర్హులందరికీ రేషన్ అందే విధంగా సంస్కరణలు ప్రారంభించింది. అదే విధంగా రేషన్ కార్డుల రద్దు పైన పౌర సరఫరాల శాఖ అధికారులు నివేదిక సిద్దం చేస్తున్నారు. తాజాగా అందిన ఆదేశాల మేరకు మండల స్థాయి నుంచి ప్రభుత్వానికి నివేదికలు అందనున్నాయి. కాగా, కొత్త రేషన్ కార్డుల మంజూరు విషయం లో లబ్దిదారులకు మంజూరు పైన జిల్లాల వారీగా లెక్కలు తీస్తున్నారు. దీంతో, తాజా ప్రతిపాదనల మేరకు పెద్ద సంఖ్యలో రేషన్ కార్డులకు కోత పడే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో రేషన్ సరఫరాలో ప్రభుత్వం కీలక మార్పులకు సమాయత్తం అవుతోంది. ప్రతీ నెలా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం కొందరు లబ్దిదారులు తీసుకోవటం లేదనే అంశం ప్రభుత్వానికి నివేదికలు అందాయి. దీంతో…అనర్హులను గుర్తించే అంశం పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పూర్తి లెక్కలు చేపట్టే పని ప్రారంభించింది. రేషన్‌ లబ్ధిదారుల్లో వరుసగా గత ఆరు నెలలుగా ఎవరెవరు బియ్యం తీసుకోవడం లేదో, ఆ వివరాలను పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ కార్యాలయం నుంచి మండల తహసీల్దార్‌ ఆఫీస్​ లాగిన్‌కు సిబ్బంది పంపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్ద సంఖ్యలో కొత్త కార్డులను మంజూరు చేసింది. వీరిలో చాలామంది సన్న బియ్యం తీసుకోవటం లేదని గుర్తించారు. దీంతో, అసలు కారణాలేమిటో గుర్తించాలని అధికారులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

నివేదికల్లో ఏముంది..?
క్షేత్ర స్థాయి నివేదికల మేరకు నిర్ణయం కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం ఇస్తున్న రేషన్ బియ్యం తీసుకొని వాటిని 10 నుంచి 20 రూపాయాల వకు అమ్ముకుంటున్న అంశం పైన క్షేత్ర స్థాయి నుంచి అధికారులు సమాచారం అందించారు. దీని కారణంగా ప్రభుత్వం అందిస్తున్న బియ్యం పక్క దారి పడుతోంది. ప్రభుత్వం అందిస్తున్న బియ్యం పోషకాలతో ఉన్నా.. మార్కెట్ లో దొరికే సాధారణ బియ్యం వైపే మొగ్గు చూపుతున్నట్లు గుర్తించారు. దీంతో.. ప్రభుత్వం ఆరు నెలల పాటు బియ్యం తీసుకోని వారి జాబితాలను సిద్దం చేయాలని పౌర సరఫరాల శాఖ కు సూచించింది. ఈ మేరకు క్షేత్ర స్థాయి నుంచి అధికారులు నివేదికలను సిద్దం చేస్తున్నారు. దీని ద్వారా ఆరు నెలలు రేషన్ తీసుకోని వారి కార్డులను రద్దు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీని పైన పూర్తి నివేదికలు అందిన తరువాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.