ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ మండలం గన్యాగుల గ్రామానికి చెందిన కొమ్మిడి సరిత, శేఖర్ రెడ్డి దంపతుల కుమార్తె కొమ్మిడి స్ఫూర్తి ఇంటర్ ఎంపీసీ విభాగంలో 470లో 468 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంక్ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో గన్యాగుల గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది.
స్ఫూర్తి సాధించిన ఈ అద్భుత ప్రతిభపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెను ఘనంగా అభినందించారు. కష్టపడి చదివితే ఎలాంటి లక్ష్యమైనా సాధించవచ్చని స్ఫూర్తి నిరూపించిందని ప్రశంసించారు.
ఈ సందర్భంగా స్ఫూర్తి కుటుంబ సభ్యులు, గురువులు ఆనందం వ్యక్తం చేస్తూ ఆమె భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. గ్రామానికి గర్వకారణంగా నిలిచిన స్ఫూర్తిని పలువురు ప్రముఖులు, విద్యాభిమానులు అభినందించారు.