Take a fresh look at your lifestyle.

మళ్లీ ‘ కొండా’ వివాదం

  • మంత్రులు ఫైసలు తీసుకుంటారంటూ వ్యాఖ్యలు వైరల్​.
  • ఫైళ్లపై సంతకాలు పెట్టాలంటే ఖర్చు పెట్టాల్సిందే.
  • తను మాత్రం సామాజిక సేవకు వాడుతున్నానంటూ మంత్రి సురేఖ కామెంట్స్​.
  • ఒక్కసారిగా మంత్రి వర్గంపై పెరిగిన విమర్శలు.
  • సర్దుబాటు ప్రక్రియలో మంత్రి. 
  • తన మాటలు వక్రీకరించారంటూ వీడియో విడుదల. 
  • గత ప్రభుత్వంలో మంత్రులు పైసలు తీసుకున్నారంటూ విమర్శలు. 
  • సురేఖ నిజం ఒప్పుకుందంటూ కేటీఆర్​ ప్రశంసలు.
  • ఆమె  చేసిన వ్యాఖ్యలపై దర్యాప్తు చేయించాలన్న కేటీఆర్.​
ముద్ర, తెలంగాణ బ్యూరో: మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అటు అధికార పార్టీని తీవ్ర ఇరకాటంలో పడేయగా ప్రతిపక్షాలకు మంచి అస్త్రాలను అందించినట్లు అయింది.ఆమె చేసిన వ్యాఖ్యలను ఊటంకిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై, రాష్ట్ర మంత్రులపై  విరుచుకుపడుతున్నారు.మొత్తం రేవంత్ సర్కార్ పూర్తిగా కమిషన్ల కక్కుర్తిలో మునిగి పోయిందంటూ  ధ్వజ మెత్తుతున్నారు. ప్రతిఫైలుకు మంత్రులకు ముడుపులు ముట్ట చెబితే తప్ప అవి ముందుకు కదలడం లేదని ఘాటుగా విరుచుకుపడుతున్నారు.వాస్తవానికి ఇదే అంశంపై గత కొన్ని రోజులుగా రేవంత్ సర్కార్ పై కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.అయితే  ఇప్పటి వరకు ఆ ఆరోపణలు కేవలం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సహజంగానే నడిచే వార్ గా అందరూ  భావించారు.కానీ తాజాగా మంత్రి సురేఖ మాట్లాడుతూ,  వివిధ పనుల నిమిత్తం తమ వద్దకు వచ్చే ఫైళ్లను క్లియర్‌ చేయాలంటే మంత్రులు మాములుగా డబ్బులు తీసుకుంటారని  వ్యాఖ్యానించారు. కానీ తన వద్దకు వచ్చే వారిని మాత్రం సామాజిక సేవ చేయాలని చెప్పుతున్నానని, ఇలా ఓ ఫైల్‌ కోసం డబ్బులు ఆఫర్‌ చేస్తే తను మాత్రం కాలేజీ భవనం కట్టాలని చెప్పి ఆ భవనం నిర్మించానని చెప్పారు.
రెండు రోజుల క్రితం వరంగల్‌లోని కృష్ణ కాలనీ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో సీఎస్‌ఆర్‌ నిధులు రూ.5 కోట్లతో అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ నిర్మించిన నూతన భవనానికి మంత్రి సురేఖ శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, ఎంతోమంది బాలికలకు ఉన్నత విద్య అందిస్తున్న ప్రభుత్వ కాలేజీ తరగతి గదులు వర్షాకాలంలో నీళ్లు చేరి జలమయమవుతున్నాయన్నారు.ఆ గదుల్లో కూర్చోలేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.పాతది కూల్చివేసి, కొత్త భవనం కట్టాలని కలెక్టర్‌ కూడా తన దృష్టికి తెచ్చారన్నారు. అందుకు రూ.4.5 కోట్లు ఖర్చు అవుతాయని అవి ఎక్కడి నుంచి తేవాలో  నాకు తెలియడం లేదన్నారు.అటవీ శాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి నా దగ్గరకు కొన్ని కంపెనీల ఫైళ్లు క్లియరెన్స్‌ కోసం వస్తుంటాయని మామూలుగా అలాంటి ఫైళ్లు వచ్చినప్పుడు మంత్రులు డబ్బులు తీసుకుని క్లియర్‌ చేస్తుంటారన్నారు. అలా వచ్చిన సందర్భంలో నేను వాళ్లతో అన్నా మాకు ఒక్క నయాపైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇచ్చే డబ్బులతో సమాజ సేవ చేయండి అని సూచించాన్నారు.ఇందులో భాగంగానే  మా ప్రాంతంలో ఒక స్కూల్‌డెవలప్‌ చేయండి మీ పేరు గుర్తుండి పోతుందని చెప్పానని అన్నారు.అప్పుడు మా చేతుల్లో ఏమీ  లేదు పై వాళ్లతో మాట్లాడతామని అరబిందో ఫార్మాకు చెందిన వ్యక్తి చెప్పారన్నారు. చివరకు సీఎస్‌ఆర్‌ నిధులు రూ.4.5 కోట్లతో కాలేజీ భవనం కడతామని చెప్పినప్పుడు నాకు సంతోషం కలిగిందని అని మంత్రి సురేఖ వ్యాఖ్యానించారు. ఆ నిధులతో గ్రౌండ్‌తో పాటు, రెండంతస్థులతో 15 తరగతి గదులు, ఆడిటోరియం,పెద్ద హాల్‌, 60 అధునాతన టాయిలెట్లు, నూతన ఫర్నిచర్‌ విద్యార్థినులకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు.కాగా మంత్రి సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలతో ఆశ్చర్యపోవడం అక్కడ ఉన్నవారి వంతు కాగా అంతేకాక మంత్రులంతా డబ్బులు తీసుకుంటారనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్లయింది.
అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు మరోసారి బీఆర్ఎస్ కు  ఆక్సిజన్ ఇచ్చినట్లు అయింది. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ, మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలను స్వాగతించారు. ఆమె మంత్రిగా కొనసాగుతూ ధైర్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను అంగీకరించారన్నారు.ఇందుకు ఆ మంత్రిని మనస్పూర్తిగా అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. రేవంత్ సర్కార్ పూర్తిగా కమిషన్ల పర్వంలో కూరుకపోయిందని విమర్శించారు. ప్రతి బిల్లుకు కమిషన్లు చెల్లించాల్సి వస్తోందని స్వయంగా కాంటాక్టర్లు సైతం సచివాలయంలో ఆందోళనకు దిగిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలన ఎంత దిగజారిందో ఈ పరిస్థితులను చూస్తుంటే అర్థమవుతోందన్నారు.ఇప్పటికైనా ఏఐసీసీ అధిష్టానం కళ్ళు తెరిచి రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కంపును కడిగిపారేయాలని సూచించారు.లేని పక్షంలో ప్రజలే ఆ పార్టీని విసిరి బంగాళాఖాతంలో పడేస్తారని హెచ్చరించారు.కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను దర్యాప్తు జరగాల్సిన అవసరముందన్నారు.
  • నేను  అలా అనలేదు.
కాగా తాను చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో మంత్రి  తన మాటలపై వివరణ ఇచ్చుకున్నారు. తాను మాట్లాడింది గత ప్రభుత్వ హయాంలోని మంత్రుల గురించి అని తెలిపారు.గతంలో ఏ పని చేయడానికైనా మంత్రులు డబ్బులు తీసుకునే వారని గుర్తు చేశారు.తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొంటూ ఒక వీడియోను విడుదల చేశారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని  మంత్రుల పనితీరును వారు ప్రతి ఫైలుకు డబ్బులు తీసుకునే వారని నేను ఆ వ్యాఖ్యలు చేసిన అది నిజమో కాదో వాళ్ళకి  తెలుసన్నారు.అయితే కొంతమంది నా వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరించడం సహేతుకం కాదన్నారు.కాంగ్రెస్ప్రభుత్వం అద్భుతంగా పరిపాలన చేస్తుంటే ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు తమ పెయిడ్ సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు.అందులో భాగంగానే ఆ వీడియోలో నా వ్యాఖ్యల్ని ముందు వెనక కొంత తీసేసి, మిగతా కొంత పార్ట్ ను కావాలనే  హైలైట్ చేయడం వెనుక ఉన్న కుట్ర ఇదేనని అన్నారు.నా వ్యాఖ్యలను పెయిడ్ సోషల్ మీడియా వాళ్ళు ఎడిటింగ్ చేసిన మార్ఫింగ్ వీడియో చేసి రెండు రోజులుగా సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తున్నారని మండిపడ్డారకు.ఈ వీడియోను ఇలా సర్కులేట్ చేసి మా కేబినెట్ సభ్యుల మధ్య గొడవ పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.ఇది సరికాదన్నారు.మీ ఆశలు నెరవేరవన్నారు.కాంగ్రెస్  ప్రభుత్వంలో మంత్రులంతా అద్భుతంగా పనిచేస్తున్నారన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి పనిచేసుడు తెలుసు.పరిపాలన చేయడం మాకు తెలుసన్నారు.బీ ఆర్ ఎస్ వాళ్ళకి సోషల్ మీడియాలో దొంగ ప్రచారం, తప్పుడు ప్రచారం ఎలా చేయడమో మాత్రమే తెలుసన్నారు.ఇటువంటి దుష్ప్రచారాలు ఇంకొకసారి చేస్తే ఎంత మాత్రం సహించేదిలేదని  హెచ్చరించారు.
ఇలా చేసే ఏ ఒక్కరిని వదిలి పెట్టేది లేదన్నారు.

Leave A Reply

Your email address will not be published.