Take a fresh look at your lifestyle.

భూసమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూభారతి చట్టం

రైతు భూములకు పూర్తి భరోసా: జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రైతుల భూములకు భరోసా కల్పించే చట్టం  భూభారతి చట్టమని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. గురువారం బుగ్గారం, ఇబ్రహీంపట్నం మండలాల్లోని రైతు వేదికల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన  తెలంగాణ భూభారతి చట్టం (భూమి హక్కుల రికార్డు చట్టం)-2025 పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు కలెక్టర్ హాజరయి  మాట్లాడుతూ ప్రజల కోసం, ప్రత్యేకించి రైతులకు వారి భూముల పై భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు.

ధరణి పోర్టల్ లో  లేని అనేక సమస్యలకు పరిష్కారం భూభారతి చట్టం ద్వారా దొరుకుతుందని, జూన్ 2 నుండి ఆన్లైన్లో భూభారతి చట్టం పోర్టల్ పనిచేస్తుందని తెలిపారు. భూములకు సంబంధించిన సమస్యలపై రైతులు దరఖాస్తు చేసుకోవచ్చని, ఏదైనా సమస్య పరిష్కారానికి దరఖాస్తు చేస్తే నిర్దేశించిన సమయంలో పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ధరణిలో వ్యవసాయ సబ్ డివిజన్ పై ఎలాంటి ప్రస్తావన లేదని , భూభారతి చట్టంలో సబ్ డివిజన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు.

ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న భూభారతి చట్టం లోని నిబంధనల ప్రకారం  రికార్డులను అప్డేట్ చేయడం జరుగుతుందన్నారు. రైతులు ఇకపై బ్యాంకు రుణాలకు వెళ్ళినప్పుడు భూములకు సంబంధించిన కాగితాలను సమర్పించాల్సిన అవసరం లేదని, భూభారతి పోర్టల్  లో నమోదైన రికార్డుల ఆధారంగానే బ్యాంకు రుణాలు ఇస్తారని తెలిపారు. భూభారతి చట్టంలోని ముఖ్యమైన అంశాలను వివరిస్తూ భూభారతి చట్టంలో మ్యుటేషన్లు ఆటోమేటిక్ గా అవుతాయని,30 రోజుల్లో మ్యుటేషన్ కాకపోతే 31వ రోజు ఆటోమెటిగ్గా మ్యుటేషన్ జరుగుతుందన్నారు. భూ భారతి అంశాలను రైతులు ఇతర రైతులతో పంచుకోవాలని, చట్టంపై అందరికీ పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.

భూభారతి చట్టంలోని అంశాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ఆర్డిఓ కార్యాలయాల్లో ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇక్కడ ఫిర్యాదులను సమర్పించి పరిష్కరించుకోవచ్చని, ఒకవేళ రైతులకు ఎవరికైనా న్యాయసహాయం అవసరమైతే ఉచిత న్యాయ సహాయాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కలెక్టర్ తెలిపారు. భూ భారతి చట్టం ద్వారా భూములకు సంబంధించిన అవినీతిని అరికట్టి, రెవెన్యూ శాఖను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. రైతులకు మేలు జరిగేలా భూ వివాదాలు లేని చట్టంగా ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. భూములకు సంబంధించిన అనేక సమస్యలకు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం దొరికిందని, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణిలో ఇలాంటి ఆకాశము లేదని తెలిపారు. భూభారతి చట్టం వల్ల రైతులకు, పేదలకు ఎంతో మేలు కలుగుతుందని తెలిపారు. ఎంతోమంది మేధావులు, అధికారులు భూభారతి చట్టానికి రూపకల్పన చేయడం జరిగిందన్నారు.

రెవెన్యూ డివిజనల్ అధికారి మధు సూదన్ మాట్లాడుతూ భూభారతి చట్టంలోని సెక్షన్లు, వాటి వివరాలపై  రైతులకు అవగాహన కల్పించారు .గతంలో ధరణిలో రికార్డుల నిర్వహణ లేదని, ఇప్పుడు రికార్డుల నిర్వహణ ఉంటుందని,  భూమి కలిగిన ప్రతి రైతుకు ఆధార్ కార్డు లాగే భూధార్ కార్డు ఇవ్వడం జరుగుతుందని ,గతంలో ఏదైనా సమస్య పరిష్కారం కాకుంటే అప్పిల్ వ్యవస్థ లేదని ,ఇప్పుడు మూడంచెల  అప్పీల్ వ్యవస్థ ఉందని, ప్రతి అంశం భూభారతి పోర్టల్ ఉంటుందని, ఎవరైనా వారి భూములకు సంబంధించిన వివరాలను  పరిశీలించుకోవచ్చు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల, మెట్ పల్లి ఆర్డీవోలు మధుసూదన్, శ్రీనివాస్, తహసీల్దార్లు ఎం.డి. మజీద్, ప్రసాద్, రెవిన్యూ అధికారులు, రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.