ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: ప్రజా కళాకారుడు, అమరజీవి కామ్రేడ్ జాకబ్ కు కళాకారులు, కవులు, అభిమానులు ఘనంగా నివాళ్ళు అర్పించారు. జాకబ్ నాలుగవ వర్ధంతి సందర్బంగా గురువారం గోదావరిఖని భాస్కరరావు భవన్లో కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లర్పించారు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అమరజీవి కామ్రేడ్ జాకబ్ 45 సంవత్సరాల పాటు కవిగా, కళాకారుడిగా జన చైతన్యానికి పాటుపడినారని కొనియాడారు. సింగరేణి బిడ్డగా గని కార్మికుల సమస్యలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, కూలీలు, పేదప్రజల సమస్యలను కూడా జోడించి వందలాది కళా ప్రదర్శనలు ఇవ్వడంలో కీలక పాత్ర పోషించినాడని ఆయన జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు.
ప్రజా కళాక్షేత్రంలో జాకబ్ లేని లోటు తీర్చలేనిదన్నారు. జాకబ్ స్మారకంగా నిర్మాణమౌతున్న విగ్రహ ప్రతిస్టాపన కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేసారు. తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నం లక్మినారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, సిపిఐ నగర కార్యదర్శి కే.కనకరాజు, సిపిఐ పూర్వ జిల్లా కార్యదర్శి గౌతం గోవర్ధన్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్, అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి వేల్పుల నారాయణ,అంబేద్కర్ సంఘం నాయకులు మైస రాజేష్ లు హాజరై ప్రసంగించారు.