-
పర్యావరణ ప్రభావముల పై సిబ్బందికి అవగాహన కార్యక్రమం
బోడుప్పల్, ముద్ర విలేకరి: బహిరంగ ప్రదేశములలో చెత్త ను మరియు ప్లాస్టిక్ వ్యర్థములను కాల్చడం వలన పర్యావరణ మీద ప్రభావం చూపుతుందని, ఇది ప్రజారోగ్యానికి హాని కలిగిస్తుందని బోడుప్పల్ నగర పాలక సంస్థ కమిషనర్ ఎ.శైలజ తెలిపారు. ఇలా కాల్చడం వల్ల గాలి లో కార్బన్ మోనాక్సైడ్ (CO), డయాక్సిన్లు, ఫ్యూరాన్లు మరియు కణిక పదార్థం వంటి విష వాయువులను విడుదల అయి గాలి కలుషితమై శ్వాస కోశ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశమున్నందున బహిరంగంగా చెత్తను కాల్చడం నిషేధించామని తెలిపారు.
మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి నిర్వహించిన అవగాహన శిబిరంలో ఆమె ఆదివారం ప్రసంగించారు. అదే విధముగా కాల్చిన తరువాత వచ్చే బూడిద వలన భూ గర్భ జలాలు కలుషిత మవుతాయని తెలిపారు. అందువల్ల పారిశుధ్య సిబ్బంది మరియు పట్టణ ప్రజలు సహకరించి స్వచ్ఛ బోడుప్పల్ కు సహకరించాలని కోరారు. ఎవరైనా ఇట్టి నిషేధమును అతిక్రమించినట్లయితే జరిమానా విధిస్తామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో శానిటరీ ఇన్స్పెక్టర్ బి. నారాయణ రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ వినోద్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ నిఖిల్, వార్డ్ ఆఫీసర్స్, వార్డ్ సూపెర్వైసర్స్, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.