Take a fresh look at your lifestyle.

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి- జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి

ముద్ర, వనపర్తి :
వనపర్తి పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ రహదారులపై రోడ్డు ప్రమాదాలు నివారించడానికి చేపట్టాల్సిన మౌలిక వసతులను గుర్తించి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆర్అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో పోలీసు, జాతీయ రహదారుల విభాగం, మున్సిపాలిటీ, పీఆర్ తదితర శాఖల అధికారులతో రహదారి భద్రత జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో పాటు జిల్లా ఎస్పీ డి. సునీత రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ గత కమిటి సమావేశంలో కమిటి దృష్టికి వచ్చిన అంశాలు ఇచ్చిన ఆదేశాలు ఎంతవరకు అమలు అయ్యాయో అధికారులను ప్రశ్నించారు. జాతీయ రహదారి పై గుర్తించిన బ్లాక్ స్పాట్ ప్రాంతాలు వెల్టూర్ జంక్షన్, మదర్ థెరిసా జంక్షన్, పాలెం బ్రిడ్జి, పెబ్బేర్ బైపాస్ రోడ్డు, విలియంకొండ, రంగాపూర్ తదితర ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరగకుండా చేపట్టాల్సిన చర్యల పై ఇచ్చిన సూచనలు ఎంతవరకు పూర్తి చేశారని జాతీయ రహదారి ఇంజనీరింగ్ అధికారులను ప్రశ్నించారు. అందుకు వారు సమాధానం ఇస్తూ జిల్లా కమిటీ సూచనల మార్కు బ్లాక్ స్పాట్ ప్రాంతాల్లో సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయడం, హైమాస్క్ లైట్లు, బ్లింకింగ్ లైట్లు, రంబుల్ స్ట్రిప్ ఏర్పాట్లు చేయడం జరిగిందని కమిటి దృష్టికి తెచ్చారు. విలియం కొండ వద్ద అనధికారిక యు టర్న్ ను మూసివేయడం జరిగిందని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. స్పందించిన కలెక్టర్ జాతీయ రహదారి ఇంజనీరింగ్ అధికారుల పనితీరును అభినందించారు. అన్ని చర్యలు చేపట్టినప్పటికీ ప్రమాదాలు జరుగు తున్నాయని వాటికి గల సూక్ష్మ కారణాలను అన్వేషించాలని ఇంజనీర్లను సూచించారు. రోడ్డు ప్రమాదాలు నివారించే క్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న భద్రత పరమైన అంశాలపై మరింతగా దృష్టి సారించాలని ఆదేశించారు. అవసరమైన చోట అండర్ పాస్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయాలని, అనవసరపు యు టర్న్ లను తగ్గించాలని సూచించారు. అదేవిధంగా జాతీయ రహదారులపై రాంగ్ రూట్లో వచ్చే వారిని కట్టడి చేయాలని సూచించారు.
వనపర్తి పట్టణంలో అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో వెళ్లే ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ రోడ్ల పై ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు సంబంధిత పోలీస్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి చేపట్టాల్సిన చర్యల పై కమిటీకి ప్రతిపాదనలు సిఫారసు చేయాలని సూచించారు. ప్రస్తుతం పోలీస్ అధికారులు సిఫారసు చేస్తున్న ప్రతిపాదనలను వచ్చే కమిటీ సమావేశం నాటికి పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. మదనపూర్ వంతెన పనులను వర్షాకాలము ప్రారంభం అయ్యే నాటికి పనులు పూర్తి చేసి అందు బాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
ట్రాఫిక్ రూల్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
జిల్లాలో రవాణా, పోలీసు శాఖ అధికారులు ట్రాఫిక్ రూల్స్ అమలుపై పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అధిక లోడు తో ప్రయాణించే ఆటో రిక్షాలు, బైక్ లపై ముగ్గురు ప్రయాణించే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ డి సునీత రెడ్డి సైతం రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన పలు చర్యల పై సూచనలు చేసారు. సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఎన్. ఖీమ్య నాయక్, డి.ఎస్.పి వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బీ అధికారి దేశ్యా నాయక్, డి సీ ఆర్ బీ డిఎస్పీ బాలాజీ నాయక్, ఆర్టీవో మమత, ఎస్సై లు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.