- రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్
ముద్ర ప్రతినిధి,పెద్దపల్లి:రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అక్రమ ఇసుక రవాణాను నియత్రించేందుకు సమర్థవంతంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ అన్నారు. ఇందులో భాగంగానే కమిషనరేట్ పరిధిలోని మంథని ముత్తారం పోలీస్ స్టేషన్ పరిధిలోనీ ఖమ్మంపల్లి, జిల్లాల పల్లిలోని ఇసుక తరలించే ఇసుక క్వారీలను గురువారం ఆకస్మికంగా ఆయన సందర్శించారు. క్వారీ సందర్శించి ప్రధానంగా రవాణాదారులు ఇసుకను అక్రమంగా తరలించే మార్గాలపై పోలీస్ కమిషనర్ స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాహనాల వేబిల్స్, లోడ్ పరిమితినీ పరిశీలించారు. ముఖ్యంగా అక్రమంగా ఇసుక తరలించే వారి సమాచారాన్ని అందుబాటులో వుంచుకోవడంతో పాటు వారి కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. తనిఖీలు జరిపే సమయంలో సిబ్బంది తప్పనిసరిగా తనిఖీ చేసిన వాహన వివరాలను నమోదు చేసుకోవాలని, ఇసుక తరలించే వాహనాలకు అనుమతి పత్రాలు ఉన్నాయో కూడా తప్పనిసరిగా పరిశీలించాలని. నిరంతరం ఇసుక రవాణా వాహనాలపై నిఘా పెట్టాలని పోలీస్ కమిషనర్ సూచించారు. ఈ సందర్భంగా అక్కడ విధులలో ఉన్న అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే అట్టి వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేసారు. ప్రస్తుతం ప్రభుత్వ అనుమతితో నడుస్తున్న ర్యాంపుల నుండి ఇసుక తరలించే విధానాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి డా. చేతన ఐపిఎస్ గారు, స్పెషల్ బ్రాంచ్ ఎసిపి రాఘవేంద్ర, గోదావరిఖని ఎసిపి రమేష్, మంతిని సిఐ రాజు, ముత్తారం ఎస్ ఐ నరేష్ పాల్గొన్నారు.