ముద్ర, మహాదేవపూర్:
గన్పూర్ నుండి హైదరాబాద్ కు నూతన బస్ సర్వీస్ ను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఘనపురం బస్ స్టాండ్లో ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు హైదరాబాద్ నగరానికి రాకపోకలు సులభతరం చేయడం లక్ష్యంగా ఈ సర్వీసును ప్రారంభించామని తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, వైద్య సేవలకు వెళ్లే ప్రజలు తదితరులకు ఈ సర్వీసు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రవాణా సౌకర్యాలను విస్తరించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయడంలో రవాణా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. జిల్లా ఎస్పీ సంకీర్త్ ప్రయాణికులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని, సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు. బస్ స్టాండ్ పరిసరాల్లో ట్రాఫిక్ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అనంతరం బస్టాండ్ నుండి పోలీస్ స్టేషన్ వరకు బస్సులో ప్రయాణించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు మరియు ప్రజలు పాల్గొన్నారు.