- లబ్ధిదారులకు వందశాతం హక్కులతో ఉచితంగా స్థలాల రిజిస్ట్రేషన్.
- భవిష్యత్తులో రేడియల్ రోడ్డు వచ్చే విలువైన ప్లాట్లను ఎవరూ అమ్ముకోవద్దు.
- రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి.
ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి: పారదర్శకంగా, వంద శాతం హక్కులతో ప్రభుత్వం ఫార్మా రైతులకు స్లాట్లు అందజేస్తుందని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. కందుకూరు మండలం మీర్ఖాన్ పేట్ రెవెన్యూలో ఏర్పాటు చేసిన లేఅవుట్లో యాచారం, కందుకూరు మండలాల పరిధిలోని 7 గ్రామాలకు చెందిన భూనిర్వాసితులకు సోమవారం లబ్దిదారుల చేతుల మీదుగా లాటరీ ద్వారా ప్లాట్లను కేటాయించడం జరిగింది.ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ అన్ని సదుపాయాలతో లేఅవుట్ను రూపొందించి ప్రభుత్వం రైతులకు విలువైన స్థలాలను అందిస్తుందన్నారు. రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరిస్తూ రిజిస్ట్రేషన్ సైతం చేసి ఇస్తుందని తెలిపారు. ఇదే లేఅవుట్ నుంచి భవిష్యత్తులో రేడియల్ రోడ్డు వస్తోందని, రైతులు ఎవరూ ప్లాట్లను అమ్ముకోవద్దని కలెక్టర్ సూచించారు. అనంతరం కలెక్టర్ అక్కడే ప్రత్కేంగా ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. మొదటి రోజు 670 మంది రైతులకు లాటరీ ద్వారా ప్లాట్లను కేటాయించారు. ఈ ప్లాట్ల కేటాయింపు కార్యక్రమంలో టీజీఐఐసీ (తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ) యం.డీ. కె.శశాంక్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం శాసన సభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, ఆర్డీఓలు జగదీశ్వర్రెడ్డి, అనంతరెడ్డి, డీపీఓ సురేష్ మోహన్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
