- మంత్రివర్గ తీర్మాణాలేవీ..?
- రాష్ట్ర ప్రభుత్వంపై కాళేశ్వరం కమిషన్ సీరియస్.
- ఇప్పటికే రెండు సార్లు ప్రభుత్వానికి లేఖ.
- తీర్మాణాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశం.
ముద్ర, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అవకతవకలు, అవినీతి ఆరోపణలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్.. రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మంత్రివర్గ తీర్మాణాల మినిట్స్ ఇవ్వాలని గతంలోనే కోరినప్పటికి ఇంత వరకు స్పందించని సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ విషయమై మంగళవారం మరోసారి కమిషన్ ఛైర్మన్ పీసీ ఘోష్ ప్రభుత్వానికి లేఖ రాశారు. మంత్రివర్గ తీర్మాణాల మినిట్స్ కావాలని ఇప్పటికే రెండు సార్లు లేఖ రాశామన్న పీసీ ఘోష్..ఇప్పుడీ లేఖపై కచ్చితంగా స్పందించాల్సిందేనని హెచ్చరించారు. ఇటీవల మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, నాటి మంత్రి, ప్రస్తుత ఎంపీ ఈటెల రాజేందర్ ను కమిషన్ ప్రశ్నించింది. అయితే మంత్రివర్గం తీర్మాణాల మేరకే నిర్ణయాలు జరిగాయంటూ ముగ్గురు ముక్తకంఠంతో వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కేబినెట్ తీర్మానాల వివరాలు ఇవ్వాలని కమిషన్ కోరింది. మంత్రులు, మాజీ సీఎం కేసీఆర్ వాంగ్మూలం తర్వాత మూడోసారి సర్కార్ కు కమిషన్ లేఖ రాసింది. గతంలో ఇంజనీర్ల ఓపెన్ కోర్టు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒకసారి… ఐఏఎస్ అధికారుల విచారణ తర్వాత మరోసారి లేఖ రాసింది. ఇప్పుడు మూడోసారి లేఖ రాసింది. గతంలో రాసిన లేఖలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సమాచారం ఇవ్వలేదని కమిషన్ పేర్కొంది.ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి లేఖ రాసిన కమిషన్ మంత్రివర్గ తీర్మాణాల మినిట్స్ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. ఇప్పుడీ అంశం రాష్ట్ర రాజకీయ, పరిపాలన వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాళేశ్వరం కమిషన్ రాసిన లేఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ నెల 16న మంత్రుల సమావేశంలో ఈ విషయంపై సమాలోచనలు చేసిన సీఎం.. కమిషన్ కోరిన అన్ని వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.ఇదీలావుంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.