- గవర్నర్ ఆమోదించారా.. తిరస్కరించారా..?
- సర్కారు నుంచి గవర్నర్ కు.. అక్కడి నుంచి సర్కారుకు ఫైల్.
- ప్రొటోకాల్ సెక్రెటరీ దగ్గర వెయిటింగ్.
- గవర్నర్ నుంచి ఏం చెప్పారనేదే అసలు రహస్యం.
- కీలక అంశం లేకపోవడంతో గవర్నర్ నుంచి తిరుగు టప్పా.
- ప్రధాన ప్రతిపక్ష నేత సంతకం లేకపోవడమే కారణమా..?
- ఆర్టీఐ కమిషనర్ల ఎంపికలో త్రిసభ్య కమిటీ.
- ఈ కమిటీ మీటింగ్లో ప్రధాన ప్రతిపక్ష నేత హాజరు కంపల్సరీ.
- ఇప్పటిదాకా సమయం ఇవ్వని ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్.
- ఇప్పటికే ఆర్టీఐ సమాచారం ఇవ్వడం లేదనే విమర్శలు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కొన్ని కీలక నియామకాలు పెండింగ్ పడుతూనే ఉన్నాయి. ఇప్పటికే కేబినెట్ విస్తరణ, పార్టీ, నామినేటెడ్, కార్పొరేషన్ల చైర్మన్ల భర్తీకి కాంగ్రెస్ సర్కారు చాలా సమయం తీసుకుంటుంది.అయితే, వీటిలో కీలకంగా ఉన్న సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) అమలు కోసం ఉద్దేశించిన చీఫ్ కమిషనర్, 9 మంది కమిషనర్ల నియామకం మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై గవర్నర్కు వెళ్లిన ఫైల్ తిరిగి సర్కారు వచ్చింది.ఫైల్ నెంబర్ 492/టీ1/ఎస్/2025, డేట్02–05–2025, డబ్ల్యూఐటీటీఎస్ సీఎల్ఓ నెంబర్ 3504/ జీపీఎం అండ్ఏఆర్/22 అండ్ 08బయోడేటాస్/ సీ.వీ.ఎస్ తో గవర్నర్ నుంచి శేషాద్రికి ఫైల్ వాపస్ వచ్చింది.చాలా కాలంగా ఈ పోస్టులు ఖాళీగా ఉండటంతో దీనిపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తుంది.ఈ నెల 6న విచారణ ఉంది. అయితే, గతంలోనే మార్చ్ నెలలోనే ఈ నియామకాలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు గతంలోనే ఆదేశించింది.అయితే, నియామక ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదు.ఇటీవల ప్రభుత్వం ఆర్టీఐ కమిషనర్ల నియామకంపై కొంత ప్రయత్నాలు చేసింది.ఆర్టీఐ కమిషనర్లతో పాటుగా లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ నియామకం కోసం సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో విపక్ష పార్టీలతో భేటీ నిర్వహించారు.దీనిలో లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ నియామాలు పూర్తయ్యాయి.గవర్నర్ నుంచి ఆమోదం రావడంతో ప్రభుత్వం జీవో జారీ చేసింది. కానీ, ఆర్టీఐ కమిషనర్ల నియామకం మాత్రం ఆగిపోయింది.ఇటీవల అదిగో వస్తుంది, ఇదిగో వస్తుందని విస్తృత ప్రచారం జరిగింది.చీఫ్ కమిషనర్గా చంద్రశేఖర్రెడ్డి, కమిషనర్లుగా ఏడుగురు పేర్లు చక్కర్లు కొట్టాయి. కానీ, ఇప్పటికీ జీవో మాత్రం రావడం లేదు.
- గవర్నర్ నుంచి వాపస్.
సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్, కమిషనర్ల నియామకం కోసం ప్రభుత్వం సమావేశం నిర్వహించింది. ఈ నియామకం నిబంధనల ప్రకారం త్రిసభ్య కమిటీ భేటీ తప్పనిసరి.సీఎం, కేబినెట్లోని సీనియర్ మంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత సమావేశమై, వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అందులో ఐఏఎస్లతో కూడిన ముగ్గురు బృందం వాటిని పరిశీలించి నిబంధనల ప్రకారం అర్హుల జాబితాను త్రిసభ్య కమిటీకి అందిస్తే అందులో నుంచి ఒక చీఫ్ కమిషనర్, 9 మంది కమిషనర్లను ఎంపిక చేయాల్సి ఉంటోంది.నిజానికి, 2023లోనే వీటి నియామకం కోసం నోటిఫికేషన్ ఇచ్చారు.ఆ తర్వాత 2024లో మరోసారి నోటిఫికేషన్ ఇచ్చారు.దాదాపు 400కుపైగా దరఖాస్తులు వచ్చాయి.వాటిని సీనియర్ ఐఏఎస్ల బృందం మహేశ్దత్ ఎక్కా, వికాస్రాజ్తో పాటు సీఎస్ నేతృత్వంలో అర్హుల జాబితా తీశారు.దాన్ని ప్రభుత్వానికి సమర్పించారు. కానీ, ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్కు ఈ విషయంలో పలుమార్లు సమాచారం ఇచ్చారు. కానీ, ఆయన నుంచి నో రిప్లై కేసీఆర్ రాకపోవడంతో నియామకం ఫైల్ కూడా పెండింగ్ పడింది.గత నెలలో సీఎం రేవంత్రెడ్డి.. రాజ్యాంగబద్ధ పదవుల భర్తీకి సమావేశం ఏర్పాటు చేశారు. విపక్ష పార్టీలతో సమావేశమయ్యారు.కానీ, ఆర్టీఐ కమిషనర్ల నియామకంలో మాత్రం ప్రధాన ప్రతిపక్ష నేత హాజరుకావడం తప్పనిసరి కావడంతో ఆర్టీఐ కమిషనర్ల నియామకం తేలలేదు.అయినప్పటికీ మెజార్టీ ఫిగర్ చూపించి సీఎం, కేబినెట్ సీనియర్ మంత్రి ఆధ్వర్యంలో ఒక చీఫ్ కమిషనర్, ఏడుగురు కమిషనర్లను ఎంపిక చేసి గవర్నర్కు ఫైల్ పంపించారు.కానీ, గవర్నర్ కు పంపిన ఫైల్ ఈ నెల 30న తిరిగి ప్రభుత్వానికి వచ్చింది.సీఎంతో ముఖ్య కార్యదర్శి శేషాద్రికి ఈ ఫైల్ వచ్చింది. ఫైల్ నెంబర్ 492/టీ1/ఎస్/2025, డేట్02–05–2025, డబ్ల్యూఐటీటీఎస్ సీఎల్ఓ నెంబర్ 3504/ జీపీఎం అండ్ఏఆర్/22 అండ్ 08బయోడేటాస్/ సీ.వీ.ఎస్ తో గవర్నర్ నుంచి శేషాద్రికి చేరింది.ఈ ఫైల్ను గవర్నర్ ఆమోదించారా లేదా రిజెక్ట్ చేశారా అనేది మాత్రం ఇంకా తేలడం లేదు. గవర్నర్ ఆమోదిస్తే ఇప్పటికే ఈ నియామకాలపై ప్రభుత్వం జీవో జారీ చేయాల్సి ఉండేది. కానీ, ఇప్పటికీ జీవో రావడం లేదు. ఇప్పుడు శేషాద్రి నుంచి ఈ ఫైల్ ప్రొటోకాల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రఘునందన్రావు దగ్గర పెండింగ్లో ఉంది.
- రెండేళ్లుగా పోస్టులన్నీ ఖాళీ.
రాష్ట్రంలో సమాచార ప్రధాన కమిషనర్ 2020 ఆగస్టు 24వ తేదీన పదవీ విరమణ చేశారు.అప్పటి నుంచి మూడేళ్ల పాటు మరో కమిషనర్ ఇన్చార్జ్ ప్రధాన కమిషనర్గా కొనసాగారు. ఆయనతో పాటు మిగిలిన కమిషనర్లు కూడా 2023వ సంవత్సరం ఫిబ్రవరి 24న పదవీ విరమణ చేశారు.అప్పటి నుంచి రెండేళ్లుగా సమాచార హక్కు చట్టం ఖాళీగా ఉంది. కొత్త ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వటంతో ఏకంగా నాలుగు వందల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.ఇందులో అఖిల భారత సర్వీసులకు చెందిన రిటైర్డ్ అధికారులు, రాష్ట్ర రిటైర్డ్ అధికారులు, అడ్వొకేట్లు, జర్నలిస్టులు, ఇలా వివిధ రంగాలకు చెందినవారు ఉన్నారు.గత ప్రభుత్వంలో వచ్చిన దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశాలు ఇవ్వటంతో ఈ సంఖ్య దాదాపు ఏడు వందలు దాటింది.అయితే, అర్హుల జాబితా ఎంపిక చేసి, గవర్నర్కు పంపించినా ఆమోదం వచ్చిందా లేదా అనేది తేలడం లేదు. మరోవైపు, సమాచార హక్కు కమిషనర్లు లేకపోవడంతో 18 వేల అప్పీళ్ళు పెండింగ్లో ఉన్నాయి.
- వీరి నియామకం ఏమైనట్లు..?
ఇటీవల సీఎం భేటీ, గవర్నర్కు ఫైల్ పంపడం అక్కడి నుంచి తిరిగి రావడంతో.. సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకానికిగ్రీన్ సిగ్నల్ వచ్చిందని ప్రచారం జరిగింది.ప్రధాన కమిషనర్గా ఐఎఫ్ఎస్ అధికారి చంద్రశేఖర్రెడ్డి, కమిషనర్లుగా జర్నలిస్టు పీవీ శ్రీనివాసరావు, సీపీఆర్వోగా బోరెడ్డి అయోధ్యరెడ్డి, కప్పర హరిప్రసాద్, పీఎల్ఎన్ హరిప్రసాద్, రాములు, వైష్ణవి, పర్వీన్ మొహిసిన్ను ఎంపిక చేసినట్టు ప్రభుత్వ వర్గాల్లోనే ప్రచారం అయింది.ఈ ఫైల్ను గవర్నర్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపిస్తే అక్కడి నుంచి వాపస్ వచ్చింది.గవర్నర్ ఆమోదం తర్వాత ఉత్తర్వులు వెలువడుతాయని భావించినా ఇంకా ఎలాంటి రిప్లై లేదు. దీంతో కమిషనర్ల నియామకానికి గవర్నర్ ఏదో తిరకాసు పెట్టినట్లుగా చెబుతున్నారు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నేత హాజరుకాకపోవడం ప్రధాన కారణంగా టాక్. అంతేకాకుండా ఈ కమిషనర్ల లో ఒకరు సీఎం పీఆర్వో, మరొకరు గాంధీభవన్ పీఆర్వో, ఇంకొకరు కోదాడకు చెందిన వారు, ఇతర జర్నలిస్టులు ఉన్నట్లు ప్రచారం జరుగడంతో కమిషనర్ల ఎంపికపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారని కూడా అంటున్నారు. దీనిపై ఎవరైనా కోర్టుకెక్కితే మళ్లీ న్యాయపరమైన చిక్కులు వస్తాయని ఆంచనా వేసినట్లు తెలుస్తున్నది.