ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన మిస్ వరల్డ్ పోటీలకు ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన సుందరిలు తరలి వస్తున్నారు.ఈనెల 7 నుంచి 31 వరకు మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి.ఈ పోటీల్లో 120 దేశాలకు పైగా ప్రతినిధులు పాల్గొననున్నారు.ఆయా దేశాలకు చెందిన పోటీదారులు హైదరాబాద్కు చేరుకుంటున్నారు.ఈ క్రమంలో ఆదివారం నాడు మిస్ బ్రెజిల్ జెస్సికా పెడ్రోసో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోగానే, అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఇప్పటికే ఈ పోటీల ఏర్పాట్లను పరిశీలించేందుకు మిస్ వరల్డ్ సీఈవో, ఛైర్పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లి హైదరాబాద్ వచ్చారు.మిస్ కెనడా ఎమ్మా డయన్నా క్యాథరీన్ మోరీసన్ కూడా హైదరాబాద్కు విచ్చేశారు.మిస్ వరల్డ్ పోటీల ద్వారా తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.ఇందులో భాగంగా తెలంగాణలోని పర్యాటక, చారిత్రక ప్రదేశాలను ఆయా దేశాల ప్రతినిధులకు చూపెట్టనున్నారు.దీని కోసం పర్యాటక శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.చార్మినార్, లాడ్ బజార్, చౌమొహల్లా ప్యాలెస్, వరంగల్ వేయి స్తంభాల గుడి, రామప్ప ఆలయం, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను పోటీదారులు, ఆయా దేశాల ప్రతినిధులు సందర్శించనున్నారు.