వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి…
బీచ్మహళ్ల జిల్లా పరిషత్ హై స్కూల్ ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్…
ముద్ర ప్రతినిధి, భువనగిరి : విద్యార్ధి దశలో పదవ తరగతి అనేది మొదటి మెట్టు కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివి మెరుగైన ఫలితాలు సాధించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శనివారం భువనగిరి పట్టణంలోని బీచ్మహళ్ల జిల్లా పరిషత్ హై స్కూల్ ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య మొత్తం ఎంత మంది ఉన్నారని అడిగి తెలుసుకొని అందులో పదవ తరగతి చదివే విద్యార్థులు ఎంతమంది ఉన్నారు అని అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతి విద్యార్థులు అందరూ ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాల కి వస్తున్నారా..లేదా ఎవరైనా గైర్హాజరు అవుతున్నారా అని ఆరా తీశారు. తదనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థులను ఫిజిక్స్, గణితం సబ్జెక్టుల్లో లో ప్రశ్నలు వేశారు. రోజు ఉదయాన్నే 5 గంటలకు లేచి రెగ్యులర్ గా ఫార్ములాస్ ఒకటి రెండు సార్లు బట్టి పట్టినట్లయితే పాస్ మార్కులతో ఉత్తీర్ణత అయినట్టే అని తెలిపారు. పరీక్షల సమయం దగ్గర పడుతున్నందున కష్టపడి చదవాలన్నారు. సెలవులో వాగుల్లో, చెరువుల్లో ఈత కు వెళ్లి ప్రమాదాలు తెచ్చుకోకుండా, పరీక్షల మధ్యలో రెండు రోజులు కూడా పాఠశాలకు వచ్చి ప్రిపేర్ అవ్వాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకి కలెక్టర్ స్వయంగా భోజనం వడ్డించారు. రైస్ క్వాలిటీ సరిగా లేకపోవడంతో వెంటనే సంబంధిత సివిల్ సప్లయ్ అధికారులకు పోన్ చేసి బియ్యం వెంటనే మంచి బియ్యం సరఫరా చేయాలని , మెనూ ప్రకారం విద్యార్ధులకు రుచి కరమైన ఆహారం అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు..
