Take a fresh look at your lifestyle.

ఎన్నికల సమయంలోనే బీసీలు గుర్తుకొస్తున్నారు

  • హిందూ బీసీలు, ముస్లిం బీసీలు ఉంటారా?
  • సర్వే చూసి ఎంతో బాధపడ్డం
  • అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయ పార్టీలకు బీసీలు గుర్తుకొస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఓట్లు కోసమే బీసీ నినాదాన్ని పార్టీలు అందుకుంటున్నాయని ఆయన విమర్శించారు. తెలంగాణలో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించారని అన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చూసి ఎంతో సంతోషించామని, తీరా సర్వే చూసి బాధపడ్డామన్నారు. ఈ మేరకు మంగళవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడారు.. ప్రభుత్వం చెబుతోన్న లెక్కలకు, రాష్ట్ర జనాభా సంఖ్యకు పొంతన లేదన్నారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో తెలంగాణ జనాభా 4.33 కోట్లు అని ఉందని, కులగణన సర్వే ప్రకారం రాష్ట్ర జనాభా 3.76 కోట్లుగా తెలుస్తుందన్నారు. ఈ తతంగమంతా బీసీలను మోసం చేసేందుకే అని అన్నారు. కులగణన చేసి చేతులు దులుపుకుంటే ఎలా అని ప్రశ్నించారు. హిందూ బీసీలు, ముస్లిం బీసీలు ఉంటారా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో టికెట్ల కేటాయింపు దగ్గర నుంచి బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా లెక్కల ప్రకారం సగం సీట్లు ఇస్తామని చెబుతోన్న రాజకీయ పార్టీలు గెలిచే అవకాశం లేని స్థానాలకు బీసీలను పరిమితం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జనాభాలో 60 శాతమున్న బీసీలకు రాజకీయంగా ఎక్కడ న్యాయం జరుగుతుందని ఆయన ప్రశ్నించారు.

ఈ కులగణనతో బీసీలకు న్యాయం జరుగుతుందా అని ఆయన నిలదీశారు స్థానిక సంస్థల ఎన్నికలు మరో ఆరునెలలు ఆలస్యమైన ఫర్వాలేదని, కులగణన మాత్రం పగడ్భందీగా జరగాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. ప్రత్యేక తెలంగాణ సాధనలో ముందుండి పోరాటం చేసింది బీసీ బిడ్డలేనని అన్నారు. బడ్జెట్‌లో బీసీలకు రూ.3వేల కోట్లు కేటాయించి కేవలం రూ.15 కోట్లను మాత్రమే ఖర్చు చేశారని ఆయన ఆరోపించారు. కులసంఘాల భవనాలకు స్థలం కేటాయింపులోనూ బీసీలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. హైదరాబాద్ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో బీసీ సంఘాలకు స్థలం కేటాయిస్తున్నారని అన్నారు. అదే అగ్రవర్ణాల వారి కులసంఘాల భవనాలకు మాత్రం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో కేటాయించారని ఆయన ఆరోపించారు. బీసీల విషయంలో కేవలం తీర్మానాలు చేసి విడిచిపెడుతున్నారని, కులవృత్తులను ఆదుకుంటామని చెప్పినోళ్ళంతా దొంగలేనని అన్నారు. కులవృత్తులను నమ్ముకున్నాం కాబట్టే బీసీలు ఇంకా ఎదగలేకపోయారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కులగణన సర్వేలో హిందూ బీసీలు, ముస్లిం బీసీల అనే కొత్త పదాలు సృష్టించి, కోర్టుల పేరుతో బీసీ రిజర్వేషన్ల పెంపును పక్కదారి పట్టించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.

Leave A Reply

Your email address will not be published.