ముద్ర, తెలంగాణ బ్యూరో ;
రాష్ట్రంలో దివ్యాంగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోరుతూ మంగళవారం బీజేపీ హైదరాబాద్ లో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన బీజేపీ నాయకులు… పార్టీ శ్రేణులు దివ్యాంగులతో కలిసి బయలుదేరారు. ఈ క్రమంలో బషీర్బాగ్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో దివ్యాంగులు ఈ నిరసనలో పాల్గొన్నారు. బషీర్బాగ్ ఫ్లైఓవర్ నుంచి అసెంబ్లీ వైపు కాలినడకన బయలుదేరారు.ఎన్నికల సమయంలో దివ్యాంగులకు ఇచ్చిన పెన్షన్ పెంపు, ఇతర సంక్షేమ పథకాల హామీలను ప్రభుత్వం విస్మరించిందని పాయల్ శంకర్ ధ్వజమెత్తారు. తక్షణమే అర్హులైన వారందరికీ పెంచిన పెన్షన్లు అందజేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో భారీగా మోహరించిన పోలీసులు నిరసనకారులను బషీర్బాగ్ వద్దే అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు. దివ్యాంగుల హక్కుల కోసం తమ పోరాటం ఆగదని, ప్రభుత్వం దిగివచ్చేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని పాయల్ శంకర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.