- కాషాయమైన కోరుట్ల.
- జైశ్రీరామ్ నినాదాలతో వీర హనుమాన్ విజయాత్ర.
- పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్.
కోరుట్ల, ముద్ర: హనుమాన్ జయంతిని పురస్కరించుకొని విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే వీర హనుమాన్ విజయ యాత్ర మంగళవారం రోజు భక్తిశ్రద్ధలతో జరుగగా కోరుట్ల పట్టణమంతా కాషాయమైంది. ఈ సందర్భంగా ర్యాలి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద అర్చకులు పూజ చేశారు. హిందూ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ నుదుటి తిలకం దిద్దాలని విశ్వహిందూ పరిషత్ సభ్యులు పిలుపునిచ్చారు. అనంతరం బజరంగ్ దళ్ సభ్యులు కొబ్బరికాయ కొట్టి ర్యాలీని ప్రారంభించగా భక్తులు జైశ్రీరామ్, గడప లోపలే కులం గడప దాటితే హిందువులం అంటూ నినాదాలు చేయగా ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. అనంతరం గాంధీ రోడ్డు, జాతీయ రహదారి, కొత్త బస్టాండ్, డైమండ్ రెస్టారెంట్స్, అంబేద్కర్ నగర్, గడిబురుజు మీదుగా తిరిగి వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంది. ఈ ర్యాలీలో హనుమాన్ దీక్షపరులు భజరంగదళ్, విశ్వహిందూ పరిషత్, ఆరెస్సెస్ సభ్యులు, భక్తుల నృత్యాలు, జైశ్రీరామ్ నినాదాలతో ర్యాలీ ముందుకు సాగింది. నెల్లూరుకు చెందిన గోపీనాథ్ అనే వ్యక్తి వేసిన హనుమాన్ వేషధారణ పలువురిని ఆకట్టుకోగా చిన్నారులు, పెద్దలు పోటీ పడుతూ ఫోటోలు దిగారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ సురేష్ బాబు నేతృత్వంలో కోరుట్ల, కథలాపూర్, మేడిపల్లి ఎస్సైలు శ్రీకాంత్, నవీన్, శ్యామ్ రాజ్ లు గట్టి బందోబస్తు కల్పించారు. ఈ ర్యాలీలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్, కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జ్ జువ్వాడి నరసింహారావు, బిజెపి పట్టణ అధ్యక్షులు బింగి వెంకటేష్, సుధవేణి మహేష్, చిరుమల్ల ధనంజయ్, మాడవేణి నరేష్, తిరుమల వాసు, సాడిగే మహేష్, కలాల సాయి చందు, భజరంగదళ్, విశ్వహిందూ పరిషత్ పాల్గొన్నారు.
