ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల్ జిల్లా మెట్పల్లి మండలం కొండ్రికర్ల, వేంపేట, మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామాల్లో పాక్స్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు.ధాన్యం కొనుగోలు సెంటర్లలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని, సీరియల్ రిజిస్టర్ ప్రకారం ధాన్యం మ్యాచింగ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.నాణ్యత ప్రమాణాలకు లోబడిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని 24 గంటల లోపు మిల్లులకు తరలించాలి అని అన్నారు. అలాగే, ట్యాబ్ డేటా ఎంట్రీ నమోదు, లారీ ట్రక్ సెట్ తప్పనిసరిగా ఎంట్రీ చేయాలన్నారు. ప్రతి రోజు ఎన్ని లారీలు తరలించబడుతున్నాయి, ఎంత ధాన్యం వస్తుంద నీ ఒక్కో లారీలో ఎన్ని బస్తాలు అనే వివరాలు నిరంతరం నమోదు చేసి, తగిన రికార్డులు నిర్వహించాలి అని సూచించారు.ధాన్యం సెంటర్లలో తప్పనిసరిగా ప్యాడి క్లీనర్ ఉంచాలన్నారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, నీటి సదుపాయం, ఓ ఆర్ ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని హమాలీలు ఉదయం,సాయంత్రం సమయాల్లో పనులు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో మెట్పల్లి డివిజనల్ అధికారి శ్రీనివాస్, డి ఆర్ డి ఓ రఘువరన్, మండల తాసిల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.
