ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: జిల్లాలోని ప్రజలకు పీఎం సూర్య ఘర్ పథకం పై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.మంగళవారం సోలార్ విద్యుత్ పై కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.తెలంగాణ రెడ్కో ద్వారా పీఏం సూర్య ఘర్ – ముఫ్త్ బీజ్లి యోజన పథకం అమలు చేస్తున్నామని, ఈ పథకం క్రింద ప్రజలు స్వచ్చందంగా ఇంటి పై రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని అన్నారు.ఇంటి పై 2 కిలో వాట్ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే 150 యూనిట్ల వరకు, 3 కిలో వాట్ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే 300 యూనిట్ల వరకు ప్రతి నెలా ఉచితంగా విద్యుత్ పొందవచ్చన్నారు.ఇంటి పై ఏర్పాటు చేసుకునే రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ కు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని, కిలో వాట్ కు 30 వేలు , 2 కే.డబ్ల్యూ కు 60 వేలు, 3 కే.డబ్ల్యూ కు 78 వేల సబ్సిడీ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు.ప్రభుత్వం రెడ్కో ద్వారా అందించే వివిధ సబ్సిడీలను వివిధ శాఖల అధికారుల ద్వారా సమన్వయంతో ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.సోలార్ ప్లాంట్ ను మన ఇంటి పై ఏర్పాటు చేసుకోవడం ద్వారా మనకు ఉచిత విద్యుత్ అందుతుందని, మన అవసరాలకు మించి అధికంగా విద్యుత్ ఉత్పత్తి చేసే సమయంలో గ్రిడ్ కు విక్రయించడం ద్వారా మనకు ఆదాయం కూడా లభిస్తుందని అన్నారు.ఈ సమావేశంలో జడ్పీ సీఈవో నరేందర్, డి ఆర్ డి ఓ కాలిందిని, ఎల్.డి.ఎం.వెంకటేష్, విద్యుత్ శాఖ ఏఈ సురేష్, తదితరులు పాల్గొన్నారు.