దానం వివాదం
వీడని పార్టీ ఫిరాయింపులు కేసు
దానం నాగేందర్కు తప్పని చిక్కులు
స్పీకర్ తీర్పును కొట్టేయాలని పిటిషన్
దానంతో సహా స్పీకర్ కు హైకోర్టు నోటీసులు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. స్పీకర్ తీర్పుతో ఈ వ్యవహారం ముగిసిపోయింది అనుకుంటున్న తరుణంలో.. మరోసారి తెరపైకి వచ్చింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో దానం నాగేందర్ విషయంలో స్పీకర్ తీర్పును కొట్టేయాలని.. హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో విచారణ జరిపిన హైకోర్టు.. దానం నాగేందర్కు నోటీసులు ఇచ్చింది. అసెంబ్లీ కార్యదర్శికి కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
తెలంగాణలో సంచలనం రేపిన పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఇటీవలె అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ అనర్హత ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్చిట్ ఇస్తూ.. స్పీకర్ తన తుది నిర్ణయాన్ని వెలువరించారు. దీంతో 10 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్ దక్కినట్లు అయింది. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా.. స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పును ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. స్పీకర్ తీర్పును కొట్టివేయాలంటూ బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి.. హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు.. నోటీసులు జారీ చేసింది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారిన వ్యవహారంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని.. పిటిషనర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచారని.. ఆ తర్వాత లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే.. ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినట్లు పిటిషన్లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకే దానం నాగేందర్ వ్యవహారంలో స్పీకర్ తీర్పు సరైంది కాదని.. దాన్ని కొట్టేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీ ఫామ్పై ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్ను.. ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని పిటిషనర్ తరఫు లాయర్ కోర్టుకు విన్నవించారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి కాకుండా ఇతర పార్టీ నుంచి ఎంపీగా నామినేషన్ వేసిన రోజు నుంచే దానం నాగేందర్ను అనర్హుడిగా ప్రకటించాలని పిటిషనర్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో కర్ణాటక, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఇలాంటి పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై దాఖలైన పిటిషన్లలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రస్తావించారు.
అదే సమయంలో స్పీకర్ తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి.. ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో ఇటీవలె సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మానసం.. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్తో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్కు నోటీసులు ఇచ్చింది. ఈ వ్యవహారంలో తర్వాతి విచారణను ఏప్రిల్ 16వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ఇప్పుడు స్పీకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎలాంటి వివరణ ఇస్తారు అనే దానిపై అందరి దృష్టి పడింది.