- సమస్యలు ఉన్న చోట ముందస్తు ఏర్పాట్లు చేయండి
- మిషన్ భగీరథ అధికారులకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం
(ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి): రానున్న వేసే కాలంలో త్రాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి త్రాగునీటి సరఫరాపై సంబంధిత ఏఈలు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.జిల్లాలో మిషన్ భగీరథ గ్రిడ్ ఇంట్రా త్రాగునీటి సరఫరా లో భాగంగా చేపట్టిన పనులు ప్రస్తుతం నీటి సరఫరా జరుగుతున్న ఆవాసాలు వాటర్ స్టోర్స్ ఇబ్బందులు తదితర అంశాలపై కలెక్టర్ డివిజన్ వారీగా అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే వేసవి కాలంలో నీటి సరఫరా సమస్యలు ఎక్కడ ఉత్పన్నమవుతాయో గుర్తించి పరిష్కారానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల పై వెంటనే చర్యలు చేపట్టాలని అన్నారు. ఇంట్రాలో లీకేజీ మరమ్మతులు ఏమైనా ఉంటే వాటిపై దృష్టి పెట్టి ఎక్కడ త్రాగునీటి సరఫరాలో సమస్యలు రాకుండా చూడాలని అధికారులకు సూచించారు.
గ్రామ పంచాయతీ పరిధిలోప్రస్తుత నిధులతో పైప్ లైన్లు చిన్న చిన్న మరమ్మత్తులు చేయించి నీటి ఎద్దడిని నివారించాలని తెలిపారు. మండల మున్సిపల్ పరిధిలో సమన్వయంతో పనిచేసే రాబోయే వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళిక బద్ధంగా పని చేయాలని సూచించారు.గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా నివాస ప్రాంతాలకు త్రాగునీరు అందే విధంగా పనులు చేపట్టాలని అన్నారు.ముఖ్యంగా నీటి పంపులు,మోటర్లు,వాల్స్ లు పైపులకు సంబంధించి మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆయా గ్రామాలు నీటి సరఫరా అధికారులు సందర్శించి అందుకు కావలసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో నీటి సరఫరా గావించాలని తెలిపారు.ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఇఇ రాజేశ్వర్, ఏఇలు, డిఇలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
