- పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ అన్నివిధాలా సానుకూలం
- పెట్టుబడులు పెట్టి తెలంగాణ రైజింగ్లో పారిశ్రామికవేత్తలు భాగస్వామ్యం కావాలి
- ప్రపంచంలో అతిపెద్ద లెన్స్ కార్ట్ తయారీ ప్లాంట్ ఏర్పాటుతో తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తం
- రావిర్యాలలో లెన్స్ కార్ట్ కళ్ళజోడు తయారీ ప్లాంటుకు శంఖుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి
ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహిస్తూ తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ పారిశ్రామిక వాడలో ప్రముఖ కళ్ళజోడు లెన్స్ కార్ట్ కంపెనీ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు మంత్రి శ్రీధర్ బాబు కంపెనీ ప్రతినిధులతో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. పెట్టుబడులు పెట్టి “తెలంగాణ రైజింగ్”లో భాగస్వామ్యం కావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టె పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు.తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు దక్కేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందన్నారు.లెన్స్ కార్ట్ ప్రపంచంలోనే అతి పెద్ద కళ్లజోడుల తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు.ఈ కంపెనీ రాకతో తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వ వ్యాప్తం అవుతుందని మంత్రి చెప్పారు.లెన్స్ కార్ట్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, లెన్స్కార్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య గతేడాది డిసెంబర్ 8న ఒప్పందం కుదిరిందన్నారు.దీంతో ఈ ప్లాంట్ ఏర్పాటు కు ప్రభుత్వం తరఫున తుక్కుగూడ సమీపంలో రావిర్యాలలో 50 ఎకరాలు కేటాయించామని చెప్పారు. ఇప్పటికే లెన్స్కార్ట్ కు రాజస్థాన్లో అధునాతన కళ్లజోడు తయారీ యూనిట్ ఉందన్నారు.కానీ,మన రాష్ట్రంలో ఏర్పాటు కాబోయే ప్లాంట్ ప్రపంచంలోనే లెన్స్ కార్ట్ కు అతిపెద్ద ప్లాంట్ కాబోతోందన్నారు. అత్యాధునిక టెక్నాలజీ తో ఏర్పాటు కానున్న ఈ ప్లాంట్ తెలంగాణ కు తలమానికం అవుతుందన్నారు
తద్వారా తయారీ రంగంలో తెలంగాణను మరింత ముందుకు తీసుకెళ్లడం ఖాయమన్నారు. రూ.1500 కోట్లతో రావిర్యాలలో ఏర్పాటు చేయబోయే లెన్స్ కార్ట్ ప్లాంట్ ద్వారా సుమారు 2వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.రెండేళ్లలో ఈ ప్లాంట్ లో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని,నాలుగేళ్లలో పూర్తిగా కార్యకలాపాలు మొదలవుతాయన్నారు.ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులు జపాన్, సింగపూర్, థాయ్లాండ్, తైవాన్,ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా,వియత్నాం,యూఏఈ,సౌదీ అరేబియా దేశాలకు ఎగుమతి అవుతాయని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.శంకుస్థాపన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, లెన్స్ కార్ట్ ప్రతినిధులు చౌదరి, సుమిత్, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.