– మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
ముద్ర, హైదరాబాద్ :
మల్గాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలంగాణ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ఉద్యోగుల సమస్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు లేకుండా ప్రభుత్వ కార్యాలయాలు నడవవని పేర్కొంటూ, వారి సేవలకు తగిన గౌరవం, భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉద్యోగుల నుంచి 18 శాతం సర్వీస్ ట్యాక్స్ వసూలు చేయడం అన్యాయమని ఆయన మండిపడ్డారు. మధ్యలో ఉన్న ఏజెన్సీలు ఉద్యోగులను దోపిడీ చేస్తున్నాయని, వారికి ఇష్టం వచ్చినట్లు తొలగింపులు చేస్తున్నాయని ఆరోపించారు. ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం, ప్రతి నెలా సమయానికి జీతాలు, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు తప్పనిసరిగా అమలు చేయాలని అన్నారు.
ఇళ్లు కిరాయిలు, పిల్లల ఫీజులు, వైద్య ఖర్చులు భరించలేక అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈటల రాజేందర్ తెలిపారు. ఉద్యోగుల కోసం హెల్త్ కార్డులు ఇవ్వడంతో పాటు మరణించినప్పుడు కుటుంబానికి కోటి రూపాయల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా పేద ఉద్యోగుల జీవితాల్లో మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాట కార్యాచరణ కొనసాగించాలని, తాను సంపూర్ణ మద్దతు ఇస్తానని ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు.