ముద్ర మల్కాజిగిరి
ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు, హయత్నగర్ పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో అంతర్రాష్ట్ర నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల రాకెట్ను బట్టబయలు చేశారు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసి, సుమారు 600 కిలోల నకిలీ బీటీ-3 పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.
పెద్దాంబర్పేట్లోని పిస్తా హౌస్ హోటల్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న రెండు వాహనాలను తనిఖీ చేయగా, మహీంద్రా బొలెరో వాహనంలో 10 గన్నీ సంచుల్లో నకిలీ పత్తి విత్తనాలు గుర్తించారు. నిందితులు నంద్యాల జిల్లా నుంచి తెలంగాణకు అక్రమంగా విత్తనాలు తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
పోలీసులు టాటా నెక్సాన్, మహీంద్రా బొలెరో వాహనాలతో పాటు నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రైతులకు అధిక దిగుబడి వస్తుందని నమ్మబలికి నకిలీ విత్తనాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారని తెలిపారు.
ఈ నకిలీ విత్తనాల వాడకం వల్ల పంటలు దెబ్బతినడంతో పాటు రైతులకు భారీ ఆర్థిక నష్టం కలిగే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు. పరారీలో ఉన్న మరో నిందితుడు రామ్మోహన్ రెడ్డి కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు.