- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
- ఫార్మసిటీ, ఫోర్త్ సిటీ పేరుతో రైతులను అయోమయానికి గురి చేయొద్దు
- రైతులతో చర్చించాకే భూసేకరణ చేపట్టాలి
ముద్ర, ఇబ్రహీంపట్నం: ఫోర్త్ సిటీ పేరుతో రైతుల నుండి బలవంతపు భూసేకరణ ఆపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం యాచారం మండల పరిధిలోని కురుమిద్ద గ్రామంలో ఫార్మా సిటీ భూసేకరణలో భూములు కోల్పోతున్న రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్మసిటీ, ఫోర్త్ సిటీ పేరుతో రైతులను అయోమయానికి గురి చేయవద్దని, రైతులతో చర్చించి భూసేకరణ చేపట్టాలని అన్నారు. ఫార్మాసిటీ రద్దు చేస్తామన్న ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం విడ్డూరంగా ఉందని చెప్పారు.ఫోర్త్ సిటీ పేరుతో బలవంతం భూసేకరణ ఆపాలని,మార్కెట్ విలువ ప్రకారం రైతులకు భూముల ధర చెల్లించాలని అన్నారు. ఎకరాకు 800 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.రైతుల హక్కులను హరించాలని చూస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.రైతుల పక్షాన సీపీఎం ఎల్లప్పుడూ పోరాటాన్ని చేస్తుందని,ఈ నెల 20, 21 వ తేదీలలో పాదయాత్ర చేపట్టి కలెక్టరెట్ ముట్టడిస్తామని చెప్పారు.రైతులను తరిమేసి ఫోర్త్ సిటీ ఏర్పాటు చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య,మధుసూదన్ రెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దుబ్బాక రామచందర్, మండల కార్యదర్శ ఆల్లంపల్లి నరసింహ, జిల్లా కమిటీ సభ్యులు పెరుమండ్ల అంజయ్య, పెండ్యాల బ్రహ్మయ్య, అల్లంపల్లి జంగయ్య, న్యాయవాది అరుణ్ కుమార్, రైతులు పాల్గొన్నారు.