ముద్ర ప్రతినిధి, మెదక్:
రహదారి నియమాలు పాటిస్తూ వాహనదారులు బాధ్యతతో వాహనాలు నడిపితే రహదారి ప్రమాదాలను సమర్థవంతంగా నివారించవచ్చని ఐజీ చంద్ర శేఖర్ రెడ్డి అన్నారు.

బుధవారం మనోహరాబాద్ మండలంలోని కాళ్లకల్ లో జరిగిన అరైవ్ – ఆలైవ్ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావులు పాల్గొన్నారు.
డ్రైవర్స్ కు ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించి, డ్రైవర్లకు పలు కంటి పరీక్షలు నిర్వహించారు. ఐజీ చంద్ర శేఖర్ రెడ్డి మాట్లాడుతూ…ట్రాఫిక్ నిబంధనల పట్ల బాధ్యతాయుత ప్రవర్తనను ప్రజలు అలవాటు చేసుకోవాలని, తూప్రాన్, కాళ్లకల్ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చిల్డ్రన్స్ రోడ్ సేఫ్టీ డే జరపాలని, 4 సంవత్సరాలు పైబడిన వయసు కలిగిన పిల్లలకు సైతం వాహనాలపై తీసుకెళ్ళే సమయంలో వారికి కూడా హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పక ధరించాల్సిన ఆవశ్యకత గురించి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. మైనర్ లు వాహనాలు నడపకూడదని, డ్రంకెన్ డ్రైవ్, ఓవర్ స్పీడ్ వంటి వాటి గురించి విస్తృత ప్రచారం నిర్వహిస్తూ, ప్రజల్లో అవగాహన పెంపొందించాలని అన్నారు. స్కూల్ బస్సులు ఫిట్ నెస్ కలిగి ఉండేలా చూడాలన్నారు. కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని,వాహన చోదకులు హెల్మెట్ తప్పక తీసుకోవాలన్నారు. రోడ్డుపై ప్రయాణించేటపుడు ఎదుటి వారి అజగ్రత్తలను కూడా గమనించి ప్రయాణించాలన్నారు.

ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ..రోడ్డు ప్రమాదాలను నివారించాలనీ,ప్రతి సం; దాదాపు 7000 ప్రమాదాలు జరుగుతున్నాయని, జాగ్రత్తలే ప్రమాదాల నివారణకు మార్గమన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి, డీఎస్పీలు, స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.