ముద్ర ప్రతినిధి, వనపర్తి : విద్యార్థులకు కంటిచూపు సరిగా ఉన్నప్పుడే చదువుపై చక్కగా దృష్టి కేంద్రీకరించగలరని, అందుకోసమే జిల్లాలోని విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షల కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని జడ్పీ ప్రభుత్వ బాలుర పాఠశాలలో విద్యార్థులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించి, కంటి చూపు సమస్యలు ఉన్నవారికి ఉచితంగా కళ్లద్దాలను పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుపై దృష్టి సాధించాలంటే, కంటి చూపు ఎంతో కీలకమని అన్నారు. కంటిచూపు సరిగా లేకపోతే చదువుపై దృష్టి కేంద్రీకరించక, పరీక్షల్లో రాణించలేక పోవడం జరుగుతుందన్నారు.అందుకే జిల్లాలోని, 300 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 30 వేలకు పైగా మంది విద్యార్థులకు జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు.
అందులో దాదాపు 2వేల మంది విద్యార్థులకు కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించిన్నట్లు చెప్పారు. అలా సమస్యలు గుర్తించిన వారిలో 946 మంది విద్యార్థులకు ఉచితంగా కళ్లద్దాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని చదువుపై దృష్టి సాధించి మంచి మార్కులు సాధించాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్ మాట్లాడుతూ విద్యార్థులు కంటిచూపు సరిగా ఉన్నప్పుడే బాగా చదవగలరని భావించిన కలెక్టర్ తన నిధుల నుంచి ప్రత్యేకంగా విద్యార్థుల కోసం ఉచితంగా కళ్లద్దాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు.కాబట్టి విద్యార్థులు చక్కగా చదువుకొని పరీక్షల్లో బాగా రాణించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాసులు, వైద్య సిబ్బంది, బాలుర పాఠశాల ప్రిన్సిపల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.