గద్దర్ అవార్డుల్లో గోల్మాల్ ఫంక్షన్ పేరుతో మాయ రెండు కోట్లు నొక్కేశారా? బీఆర్ఎస్ నేత దాసోజు సంచలన ట్వీట్
ముద్ర, తెలంగాణ బ్యూరో :
గద్దర్ అవార్డుల నిర్వహణ మరోసారి వివాదానికి దారి తీసేలా ఉంది. బీఆర్ఎస్ నేత దాసోజు ప్రవీణ్ ఈవెంట్ నిర్వహణ, లెక్కలపై సంచలన ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘గద్దర్’ పురస్కార వేడుక రాజకీయ విమర్శలకు దారి తీసింది. ఈవెంట్ రోజు ప్రముఖ రచయిత – దర్శకుడు విజయేంద్ర ప్రసాద్, అగ్ర నిర్మాత డి సురేష్ బాబులను నిర్వాహకులు అవమానించారని వార్తలు వచ్చాయి. మీరెవరు? అని వాళ్ళిద్దర్నీ ప్రశ్నించడం, ముఖ్యంగా ‘మీరు ఆర్ నారాయణ మూర్తి కదా?’ అని విజయేంద్ర ప్రసాద్ దగ్గర మాట్లాడటంతో వాళ్లిద్దరూ ఈవెంట్ లోపలకు వెళ్లకుండా వచ్చేశారు. ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుందీ ఈవెంట్. నిర్వహణలో గోల్ మాల్ చేశారని, ఈవెంట్ పేరుతో సుమారు రెండు కోట్లు నొక్కేశారని విమర్శలు వస్తున్నాయి.
రెండు కోట్లకు నాలుగు కోట్ల బిల్!?
డబ్బులు లేవని తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలు ఆపేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, సాదాసీదాగా బతికిన గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తూ ప్రజల సొమ్మను లూటీ చేశారని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఆయన పేరు మీద డబ్బులు దోపిడీ చేశారని ఆయన పేర్కొన్నారు. ‘గద్దర్ ఈవెంట్స్’ కోసం రెండు కోట్లు ఖర్చు అయితే… నాలుగు కోట్లు డ్రా చేశారని ఆరోపించారు.
శ్రేయా ఘోషల్ కోసం కోటీ 65 లక్షలా?
గద్దర్ అవార్డ్స్ ఈవెంట్ (Gaddar Awards Event Controversy)ను బాలీవుడ్ మేనేజ్మెంట్ సంస్థకు అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం. ఈవెంట్లో పెర్ఫార్మన్స్ చేసిన వాళ్ళు ఎవరెవరికి ఎంత ఇచ్చారనేది ఒక షీట్ బయట పడింది. అందులో ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal)కు ఒక కోటి 65 లక్షల రూపాయలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. నిధి అగర్వాల్ – 20 లక్షలు, దేవి శ్రీ ప్రసాద్ – 60 లక్షలు ఇచ్చినట్టు తెలిపారు. యాంకర్లు సుమ కనకాల, ప్రదీప్ మాచిరాజులకు ఏడు లక్షలు ఇచ్చినట్టు తెలిసింది. ఈవెంట్ కోసం చేసిన ఖర్చు పట్ల విమర్శలు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.
అదనపు ఖర్చు ఎవరు చేశారు?
గద్దర్ అవార్డుల కోసం రెండు కోట్ల 13 లక్షల ఖర్చు అయితే… నాలుగు కోట్ల 11 లక్షల బిల్ వేశారని, అదనపు ఖర్చును ఎవరు ఓకే చేశారు? అనేది తెలియాల్సి ఉందని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. అది సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓకే చేశారా? లేదంటే ఫిల్మ్ డెవలెప్మెంట్ కొర్పోరేషన్ ఛైర్మన్ ‘దిల్’ రాజు ఓకే చేశారా? అనేది ప్రశ్నించారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందో చూడాలి.