- మీనాక్షి నటరాజన్ కు ఎమ్మెల్సీలు అద్దంకి, విజయశాంతి ఆల్టీమేటం.
- మంత్రివర్గ విస్తరణ కొలిక్కి వచ్చిన వేళ కొత్త తలనొప్పి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : అధికార పార్టీలో కొత్త లొల్లి మొదలైంది. మంత్రివర్గ విస్తరణ అంశం కొలిక్కి వచ్చిన వేళ ఇద్దరు కీలక నేతలు తమకు మంత్రి పదవి ఇవ్వాల్సిదేనని తేల్చి చెప్పినట్లు అధికార పార్టీలో తీవ్ర చర్చ జరుగుతున్నది. ఇన్నాళ్లూ మంత్రి పదవిపై ఎలాంటి ఆశ లేదని స్పష్టం చేసిన ఆశావాహులు తాజాగా అమాత్య పదవి కోసం గళమెత్తడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆదివారం గాంధీ భవన్లో వరుస సమీక్షలు, భేటీలు నిర్వహించిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఈ చేదనుభవం ఎదురైంది. మీనాక్షి నటరాజన్తో భేటీ అయిన ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, విజయశాంతి మంత్రి వర్గ విస్తరణలో తమకు అవకాశం కల్పించాలని కోరారు. విజయశాంతి 15 నిమిషాల పాటు మీనాక్షితో చర్చించి, బీసీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని అభ్యర్థించినట్లు తెలిసింది. అలాగే అందుబాటులో ఉన్న ఎంపీలతోనూ మీనాక్షి సమావేశం నిర్వహించి, పార్టీ సంస్థాగత విషయాలపై చర్చించారు. అయితే ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, నల్గొండ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఇదీలావుంటే మీనాక్షి నటరాజన్ ఫిబ్రవరిలో ఇన్ఛార్జ్గా నియమితులైన తర్వాత పార్టీలో అంతర్గత సమన్వయం, మంత్రి వర్గ విస్తరణపై ఒత్తిళ్లు పెరిగాయి. కొందరు నాయకులు మీనాక్షి నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కొందరు నేతలు పెదవి విరుస్తున్నారు. ఇలాంటి సమీక్షల ద్వారా పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారని మరికొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు.