- స్వాగతం పలికిన మంత్రి శ్రీధర్ బాబు.
మహాదేవపూర్, ముద్ర విలేఖరి: రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ దంపతులు సరస్వతి ఘాట్ లో పుష్కర స్నానమాచరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కాలేశ్వరం పుణ్యక్షేత్రంలోని త్రివేణి సంగమంలో ప్రతిష్టాత్మకంగా 11వ రోజుకు చేరుకున్న సరస్వతి పుష్కరాలలో గవర్నర్ విష్ణు దేవ్ సతీసమేతంగా హాజరయ్యారు. సరస్వతి ఘాటు వద్ద త్రివేణి సంగమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు సరస్వతి ఘాట్ లో శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం సరస్వతి ఏక శిలా విగ్రహాన్ని దర్శించుకున్నారు.పుష్కర స్నానానంతరం గవర్నర్ దంపతులు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.ఆలయ ప్రాంగణానికి చేరుకున్న గవర్నర్ దంపతులకు దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకట్ రావు స్వాగతం పలికారు. ఆలయ పూజారులు పరివట్టం, పూర్ణ కుంభం, మంగళ వాయిద్యాలతో పూర్వకుంభ స్వాగతం పలికారు. గవర్నర్ దంపతులు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారికి అభిషేక పూజాధికాలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు గవర్నర్ దంపతులకు ఆశీర్వచనం చేసి, స్వామివారి శేష వస్త్రాన్ని బహుకరించడంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సరస్వతి మాత చిత్రంతో కూడిన జ్ఞాపికను అందజేశారు. ఆయన వెంట ఉన్న రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రతి రోజు సాయంత్రం ఘనంగా నిర్వహిస్తున్న సరస్వతి నవరత్న మాలా హారతి కార్యక్రమ విశిష్టతను వివరించారు. ఉదయం 11.02 గంటలకు హెలికాప్టర్ ద్వారా కాళేశ్వరం చేరుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ దంపతులకు రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరే పుష్ప గుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. పుష్కర ఏర్పాట్లను గవర్నర్ జిష్ణుదేవ్ పరిశీలించి అధికారులను అభినందించారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేసిన ఏర్పాట్లు ప్రశంసనీయమని కొనియాడారు.ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ గత 11 రోజుల నుండి పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రజలు పుష్కర స్నానాలు ఆచరించి దేవుని కృపకు పాత్రులు కావాలని గవర్నర్ కోరారు.
