ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లాలో పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, హిందూ పర్వదినాల నిర్వహణ, ఊరేగింపుల కోసం కోర్టు ను ఆశ్రయించాల్సిన దుస్థితి ఎదురవుతుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ ఎస్పీ వ్యవహార శైలిపై అసెంబ్లీ లో ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టి, ప్రశ్నించనున్నట్లు ఆయన వెల్లడించారు. శ్రీ రామనవమి శోభాయాత్ర ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ పవిత్రమైన శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఊరేగింపునకు సైతం ఆంక్షలు విధిస్తున్న పోలీసుల తీరును ఆయన దుయ్యబట్టారు. అన్ని మతాల పర్వదినాలను జరుపుకొనే వెసులుబాటు ఉన్నా ఒక్క హిందువుల పర్వదినాలపై మాత్రమే ఆంక్షలు విధిస్తున్న ఎస్పీ తీరును దుయ్యబట్టారు. బాసర ట్రిపుల్ ఐటీలో బాలికలను ఉద్దేశించి ఆమె మాట్లాడిన మాటలు ఆమె స్థాయిని దిగజార్చేలా ఉన్నాయన్నారు. గతంలో కూడా ఆంజనేయ.మాల వేసుకున్న భక్తులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. కేవలం ఒక వర్గం కొమ్ముకాస్తూ హిందువులపై అక్రమ కేసులు బనాయిస్తూ అనుసరిస్తున్న తీరు అనుచితమని అన్నారు. నిర్మల్ జిల్లాలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయన్నారు. శ్యాంగడ్ లో హత్యకు సంబంధించి ఫుటేజ్ ఉన్నా చర్యలు శూన్యమన్నారు. ఎక్కడ చూసిన గంజాయి వాడకం పెరిగిపోతున్నా అరికట్టడంలో విఫలం అయ్యారని అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఎలాంటి చర్యలను సహించబోమని స్పష్టం చేశారు.