ఐటీ కారిడార్లో 6.30 ఎకరాల భూమిని కాపాడిన హైడ్రా రూ. 600ల కోట్ల విలువైన ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్
హైదరాబాద్, మార్చి 02:
ఐటీ కారిడార్కు ఆనుకుని గంధంగూడలో 6.30 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. దీని విలువ రూ. 600 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం గంధంగూడ సర్వే నంబరు 86/పి లో 6.30 ఎకరాల ప్రభుత్వ భూమిని జలమండలికి ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ స్థలంలో రకరకాల పేరిట ఆక్రమణలు చేస్తూ వస్తున్నారు. కొన్ని షెడ్డులు కూడా వేసి కబ్జా చేశారు. జలమండలి నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు మున్సిపల్, రెవెన్యూ అధికారులతో హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కోసం ప్రభుత్వం కేటాయించినదిగా గుర్తించారు. ఆ భూమిని ఆక్రమించి కొంతమంది వేసిన షెడ్డులను తొలగించింది. మొత్తం 6.30 ఎకరాల జలమండలికి కేటాయించిన భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. ప్రభుత్వ స్థలంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది.
