తెలంగాణలో బుల్డోజర్ రాజ్
కేంద్రంలో బీజేపీ, తెలంగాణలో కాంగ్రెస్ పేదల ఇండ్లు కూల్చుతున్నారు
కేరళ సీఎం పినరయి విజయన్
ముద్ర, తెలంగాణ బ్యూరో ;
తెలంగాణ లో బుల్డోజర్ రాజ్ నడుస్తోందని కేరళ సీఎం పినరయి విజయన్ విమర్శించారు. కేంద్రంలో బీజేపీ, తెలంగాణలో కాంగ్రెస్ పేద ప్రజల ఇండ్లపై బుల్డోజర్లు నడిపిసదతున్నారని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగిన ఇళ్ల కూల్చివేతలపై సోమవారం అయన ఎక్స్ వేదికగా తప్పుబట్టారు. ఖమ్మంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు బుల్డోజర్ రాజ్”ను తలపిస్తోందనీ వందలాది పేద కుటుంబాలను ముందస్తు నోటీసులు లేకుండానే రోడ్డున పడేశారని ఆయన ఆరోపించారు. గత నెల 25న తెల్లవారుజామున, ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే సుమారు 700 ఇళ్లను నేలమట్టం చేశారని విమర్శించారు. పోలీసుల పహారాలో జరిగిన ఈ చర్య వల్ల దాదాపు 3వేల మంది పేదలు నిరాశ్రయులయ్యారని, వారందరి వద్ద అవసరమైన గుర్తింపు పత్రాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
భూదాన్ ఉద్యమ స్ఫూర్తికే విఘాతం
వినోబా భావే నేతృత్వంలోని భూదాన్ ఉద్యమంలో భాగంగా భూమి లేని పేదలకు కేటాయించిన ‘వినోబా నగర్’లోని ఇళ్లను కూల్చివేయడం పట్ల కేరళ సీఎం విజయన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “1951లో ప్రారంభమైన భూదాన్ ఉద్యమ ఆశయాలను కూడా గౌరవించలేని స్థితిలో తెలంగాణ కాంగ్రెస్ ఉండటం ఆశ్చర్యకరం” అని ఆయన వ్యాఖ్యానించారు.
కేరళ మోడల్ వర్సెస్ కాంగ్రెస్ పాలన
తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాల తీరును కేరళలోని ఎల్.డీ.ఎఫ్ ప్రభుత్వంతో ఆయన పోల్చారు:
కేరళ విధానం: కొండచరియలు విరిగిపడి సర్వం కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం ఇళ్లను నిర్మించి పునరావాసం కల్పిస్తోంది. పట్టాలు లేని వారికి కూడా భూమిపై హక్కులు కల్పిస్తోంది.
కాంగ్రెస్ విధానం: పట్టాలు ఉన్న వారిని కూడా ‘నకిలీ పట్టాదారులు’గా ముద్ర వేసి ఇళ్లు కూల్చేస్తోంది. కర్ణాటకలోని యలహంక బాధితులు ఇప్పటికీ వీధుల్లోనే బతుకుతున్నారు.
బీజేపీ నకలుగా కాంగ్రెస్
కొన్ని ఉత్తరాది బీజేపీ రాష్ట్రాల్లో అమలవుతున్న విద్వేషపూరిత ‘కూల్చివేతల సంస్కృతి’ని కాంగ్రెస్ ప్రభుత్వాలు నకలు చేస్తున్నాయని విజయన్ ఆరోపించారు. కేరళలోని కాంగ్రెస్ నేతలు ఈ అమానవీయ చర్యలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వయనాడ్ దురంతం సమయంలో ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, ఆ తర్వాత ఆ ఊసే ఎత్తలేదని ఆయన గుర్తుచేశారు.