ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలో మద్యాన్ని ప్రోత్సాహించిందెవరు?.. తెలంగాణ ప్రజలను తాగుబోతులను చేసింది ఎవరో ప్రస్తుత లెక్కలను చూస్తే తెలిసిపోతుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. 60 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ.65 వేల కోట్లకు మించి పోలేదని.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో లక్షల కోట్లకు చేరిందని అన్నారు. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడి.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే నాటికి ఎక్సైజ్ శాఖ ఆదాయం రూ.10 వేల కోట్ల లోపు ఉండేదని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయే నాటికి ఎక్సైజ్ శాఖ ఆదాయం రూ.36 వేల కోట్లకు పెరిగిందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో ఎక్సైజ్ శాఖ ఆదాయం రూ.2 వేల కోట్లు తగ్గిందని చెప్పారు.