నాగర్కర్నూల్, ముద్ర ప్రతినిధి:
కల్వకుర్తి నియోజకవర్గంలో రైతులకు ఊతమిచ్చే కార్యక్రమాల్లో భాగంగా గౌరవ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పలు కార్యక్రమాలను ప్రారంభించారు. చారకొండ మండలం జూపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రైతు వేదిక వద్ద వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం వెల్దండ మండల కేంద్రంలోని రైతు వేదికలో మరో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
తదుపరి వెల్దండ గేటు వద్ద ఏర్పాటు చేసిన వే బ్రిడ్జ్ యంత్రాన్ని ప్రారంభించి, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా పాలన ప్రగతి నివేదికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణలో జరుగుతున్న రైతు వారోత్సవాల సందర్భంగా సాయిల్ సంరక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై రైతులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు.
భవిష్యత్ తరాలకు సారవంతమైన భూమిని అందించాలనే లక్ష్యంతో నేల సంరక్షణపై రైతులు కట్టుబడి ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమాల్లో చారకొండ, వెల్దండ మండలాల ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.