ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పురపాలక సంఘానికి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక మంగళవారం కూడా వాయిదా పడింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు సోమవారం పదవి స్వీకార ప్రమాణం, చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక జరగాల్సి ఉంది. అయితే బిజెపి, బిఆర్ఎస్ కౌన్సిలర్లు రాకపోవడంతో కోరం లేక వాయిదా పడింది. మంగళవారానికి ఎన్నిక వాయిదా వేసినా రెండో రోజు కూడా కాంగ్రెస్ మినహా బిజెపి, బిఆర్ఎస్ కౌన్సిలర్లు రాలేదు. దీంతో అధికారులు ఎన్నికను వాయిదా వేస్తూ తిరిగి ఎప్పుడు జరిగేది ప్రకటిస్తామని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు మాత్రం చైర్మన్ పదవి తమ పార్టీకే వస్తుందని ధీమాగా ఉన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యునిగా తన ఓటు ఉన్నందున తమ పార్టీ గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు చెరో నాలుగు సీట్లు గెలుచుకోవడంతో ఈ ప్రతిష్టంభన నెలకొంది. కాగా ఎన్నిక సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా శాంతి భద్రతలను ఎస్పీ జానకి షర్మిల స్వయంగా పర్యవేక్షించారు.