ముద్ర ప్రతినిధి, నిర్మల్:
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు విధుల్లో పాల్గొనే ప్రతి అధికారి తమ బాధ్యతలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. ఓట్ల లెక్కింపు విధుల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఓటు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో అధికారులు అత్యంత జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ సందేహాలుంటే అధికారులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, డిఈవో భోజన్న, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.