- రెవెన్యూ సదస్సుల ద్వారా పూర్తిస్థాయి అవగాహన.
- ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి.
- నియోజకవర్గంలో రెవెన్యూ సదస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే.
ఇబ్రహీంపట్నం, ముద్ర విలేకరి: భూభారతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం రెవెన్యూ సదస్సులో నిర్వహిస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెవిన్యూ సదస్సును మంగళవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతాంగ సమస్యలను పరిష్కరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు.రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రజల వద్దకే అధికారులు వచ్చి సమస్యలను పరిష్కరిస్తారన్నారు.ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సదస్సులు ఉపయోగించుకొని పట్టాదారు, భూ సమస్యలు పరిష్కరించుకోవాలని రైతులకు సూచించారు. రైతుల నుండి స్వీకరించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి గడువులోపుగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కరాచారి, కాంగ్రెస్ నాయకులు కొత్త్ కుర్మ శివకుమార్, ధనరాజ్ గౌడ్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అనంతరం అబ్దుల్లాపూర్ మెట్ మండలం, తుర్క యాంజాల్, పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీలకు సంబందించిన 236 మంది లబ్దిదారులకు రూ. 2.36 కోట్ల కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన లబ్ధిదారులకు సూచించారు.
