ముద్ర ప్రతినిధి, నిర్మల్:
రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను నిర్మల్ లోని అన్ని మండలాల్లో ఏర్పాటు చేయాలని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇదివరకే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామన్నారు. నిర్మల్ నియోజకవర్గంలోనే 19 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాసినట్లు మహేశ్వర్ రెడ్డి తెలిపారు. మొక్కజొన్న రైతులు కొనుగోలు కేంద్రాలు లేక ఆందోళన చెందుతున్నారని, మద్దతు ధర లేక ప్రైవేటు దళారులకు క్వింటాలుకు రూ.16 వందలకు అమ్మి రైతులు నష్ట పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే అన్ని మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేస్తే భారతీయ జనతా పార్టీ తరపున అన్ని మండల కేంద్రాల్లో రైతులతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.