మల్లన్న గుడి దగ్గరగా…
మన్ననూర్- శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్
ప్రాజెక్టులో కీలక మార్పులు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
శ్రీశైలం వెళ్లే భక్తులతో పాటు ఏపీకి త్వరగా చేరుకున్నేలా మన్ననూర్- శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్కు శ్రీకారం చుట్టుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మంగా తీసుకున్నాయి. అయితే ముందు అనుకున్న అలైన్మెంట్లో మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. శ్రీశైలం ఆలయానికి దగ్గరగా ఎలైన్మెంట్ రూపొందించాలని అప్రూవల్ కమిటీ సూచించింది. మన్ననూరు చెక్పోస్టుకు ముందున్న బ్రాహ్మణపల్లి గ్రామం నుంచి తెలంగాణ సరిహద్దులోని ఈగల పెంట వరకు మెుత్తం 55 కి.మీ. మేర ప్రస్తుతమున్న మార్గంలోనే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుతం ఈ మార్గంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వు పరిధిలో ఘాట్ రోడ్లు, మలుపులు అధికంగా ఉన్నాయి. కొత్తగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్నందున… ఈ మలుపుల్ని వీలైనంత తగ్గించడాలని..అందుకు అవసరమైన మార్పులు చేయాలని కేంద్ర ఎలైన్మెంట్ అప్రూవల్ కమిటీ తెలంగాణకు నిర్దేశించింది. దాంతో పాటు శ్రీశైల మల్లికార్జునస్వామి ఆలయానికి సమీపం నుంచి ఈ రోడ్డు వెళ్లేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ను కోరింది. కేంద్ర ఉపరితల రవాణాశాఖ కార్యదర్శి ఆదేశాల మేరకు.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన డీపీఆర్ కన్సల్టెంట్లు పలు ప్రత్యామ్నాయ ఎలైన్మెంట్లు, టోల్ ఆదాయ విశ్లేషణతో కూడిన నివేదికలను రెడీ చేసినట్లు తెలిసింది. ఈ నివేదికలపై త్వరలోనే అంతర్రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం హైదరాబాద్- శ్రీశైలం- నంద్యాల జాతీయ రహదారి (NH-765) భాగమైన ఈ మార్గం నల్లమల అటవీ మార్గం అమ్రాబాద్ టైగర్ రిజర్వు నుంచి వెళ్తుంది. దీంతో రాత్రి వేళ ప్రయాణానికి అనుమతి లేదు. రాత్రి 8 దాటితే మన్ననూరు వద్ద చెక్ పోస్టు క్లోజ్ చేస్తారు. పగటి సమయంలోనూ వాహనాల వేగం పరిమితి సహా పలు నిబంధనలు అమల్లో ఉన్నాయి. ప్రస్తుత ఈ హైవేలో ట్రాఫిక్ అంతరాయాలు, యాక్సిడెంట్లు జరుగుతున్న నేపథ్యంలో టైగర్ రిజర్వు ప్రాంతంలో గ్రౌండ్ లెవల్ రోడ్డుకు బదులుగా పూర్తిస్థాయిలో ఆకాశమార్గంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నుంతి ప్రతిపాదన వచ్చింది. ప్రస్తుత హైవేపై ఉన్న వాహనాల ట్రాఫిక్ లెక్కల ప్రకారం… ఈ ప్రాజెక్టు ఆర్థికంగా సాధ్యపడదని కేంద్రం ముందుగా భావించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకొచ్చి ఈ ప్రాజెక్టు మెుత్తం వ్యయంలో 33 శాతం భరిస్తామని.. సీనరేజ్, స్టేట్ జీఎస్టీని మినహాయిస్తామని ఇప్పటికే లిఖితపూర్వకంగా హామీ సైతం ఇచ్చారు. కేంద్ర ఉపరితల రవాణాశాఖలోని ఎలైన్మెంట్ అప్రూవల్ కమిటీ కొద్ది రోజుల క్రితం సమావేశమైంది. ప్రాజెక్టు ఆపరేషనల్ సామర్థ్యం మెరుగుపడేలా ప్రస్తుత ఎలైన్మెంట్ను పునఃపరిశీలించాలని సర్కార్ సూచించింది. ఎలివేటెడ్ కారిడార్ పొడవు తగ్గించేలా.. భక్తుల రాకపోకలకు కూడా అనుకూలంగా ఉండే విధంగా మార్గాన్ని రూపొందించాలని చెప్పింది. కారిడార్ ఎలైన్మెంట్ను శ్రీశైలం ఆలయానికి సమీపంగా రూపొందించాలని సూచనలు చేసింది