బుగ్గారం మండలం ఎంపీడీవో కార్యాలయంలో అందజేత
ముద్ర, కరీంనగర్ : బుగ్గారం మండలం ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం రోజున నిర్వహించిన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు పాల్గొని అర్హులైన 44 మంది లబ్ధిదారులకు 15,98,500 రూపాయల విలువ గల చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహాయ నిధి పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు అత్యవసర సమయంలో అండగా నిలిచే గొప్ప సంక్షేమ పథకమని అన్నారు. ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స పొందలేని కుటుంబాలకు ప్రభుత్వం సకాలంలో సహాయం అందిస్తూ వారి జీవితాల్లో భరోసా నింపుతోందని తెలిపారు.
ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి అర్హ కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన ప్రతి సందర్భంలో ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రజా సేవే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి స్పష్టం చేశారు.