బోథ్, ముద్ర:
బోథ్ నియోజకవర్గంలోని సొనాల మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కొరకు రూ.70 లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సొనాల గుండా అంతరాష్ట్ర రహదారి వెళ్తున్న నేపథ్యంలో సెంట్రల్ లైటింగ్ ను ఏర్పాటు చేయాలని గతంలో పలుమార్లు తాము చేసిన విజ్ఞప్తి మేరకు నిధులు కేటాయించడంపై మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో ఆయన హైదరాబాద్లోని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆయన కార్యాలయంలో కలిసి విన్నవించారు. మండల కేంద్రమైన సోనాలా ప్రజల భద్రత కోసం సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి రూ.70 లక్షల నిధులను విడుదల చేయడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిధులకు సంబంధించిన ప్రొసీడింగ్ పత్రాలను మంగళవారం హైదరాబాద్లో ఈఎన్సీ మోహన్ నాయక్ నుంచి తుల శ్రీనివాస్ అందుకున్నారు. నిధులు కేటాయించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు నిధుల మంజూరుకు సహకరించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుతో గ్రామం రూపురేఖలు మారడమే కాకుండా, రాత్రి వేళల్లో రహదారిపై ప్రమాదాల భయం తప్పుతుందని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.