ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో జడ్పీహెచ్ఎస్ ధరూర్ క్యాంప్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థుల ప్రత్యేక శిక్షణా తరగతుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగిత్యాల ఎమ్మెల్యే
ఎం.సంజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పదవ తరగతిలో ఫెయిల్ అయినంత మాత్రాన నిరాశ నిస్పృహలకు లోను కావొద్ధని, నేను కూడా పదవతరగతి పరీక్షలో రెండు సబ్జెక్టులు తప్పానని, ఉపాధ్యాయుల ప్రోద్బలంతో, ఆత్మవిశ్వాసంతో మళ్లీ పాస్ అయి, ఈ రోజు జనాలు అందరూ మెచ్చే వైద్యుడిగా, శాసనసభ్యుడిగా మీ ముందున్నానని అన్నారు. పిల్లలందరూ ఈ శిక్షణా కార్యక్రమంలో ఆయా సబ్జెక్టులో ఉన్న మెళకువలు నేర్చుకొని, ఆత్మవిశ్వాసంతో పదవ తరగతి పరీక్షలు రాసి పాస్ అయి ఉన్నత శిఖరాలకు చేరాలని ఆయన అన్నారు. అనంతరం జిల్లా విద్యాధికారి రాము మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇట్టి శిక్షణా కార్యక్రమం పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, పిల్లలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈవోలు చంద్రకళ, గంగాధర్, ధరూర్ క్యాంప్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అమర్ నాథ్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.