- ప్రోటోకాల్ తో అధికారిక ఆహ్వానం.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలో జూన్ 2న అధికారికంగా నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు, తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీకి చెందిన నలుగురి బృందాన్ని ప్రోటోకాల్ తో ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జగిత్యాల జిల్లాకు చెందిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, సభ్యులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావు, గుగ్గిల్ల రవిగౌడ్ లను జగిత్యాల జిల్లాలో జరిగే అధికారిక కార్యక్రమాలతో పాటు, జూన్ 2న జరిగే వేడుకలకు ఆహ్వానించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ కు సూచిస్తూ తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి (జీఏడి పొలిటికల్) ఎం. రఘునందన్ రావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గల్ఫ్ కార్మికుల సంక్షేమం, సమగ్ర ఎన్నారై పాలసీ పై అధ్యయనం చేయడానికి రెండేళ్ల కాలపరిమితితో ఎన్నారై అడ్వయిజరీ కమిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 10న జి.ఓ. విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీలో వైస్ చైర్మన్ తో సహా నలుగురు జగిత్యాల జిల్లా వాసులకు చోటు దక్కడం విశేషం.